బత్తలపల్లి: డప్పు దరువులు..యువత కేరింతలు.. వసంతోత్సవంతో ఉప్పొంగిన ఆనందం.. ఆడ, మగ భేదం లేకుండా అందరూ అలావ్ తొక్కుతూ మైమరచిన ఆధ్యాత్మిక ఆనందోత్సవ వేడుక శనివారం బత్తలపల్లిలో జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పేరుగాంచిన పెద్ద, చిన్న కాశీంస్వామి మొహర్రం వేడుకల్లో భాగంగా శనివారం బత్తలపల్లి నాలుగురోడ్ల కూడలిలో పీర్ల భేటీ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి జనం వేలాదిగా తరలిరావడంతో బత్తలపల్లి భక్తసాగరమైంది. చాలా మంది మిద్దెలు, మేడలు ఎక్కి పీర్ల భేటీని అబ్బురంగా చూశారు. పోట్లమర్రి, గంటాపురం, వేల్పుమడుగు, రాఘవంపల్లి, ఈదుల ముష్ఠూరు, మల్కాపురం గ్రామాల పీర్లు బత్తలపల్లి చిన్నకాశీం, పెద్ద కాశీం స్వాములతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు బెల్లపు ఉంటలను పీర్లపైకి విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. బేటీ అనంతరం ఆయా గ్రామాల పీర్లు తిరిగి వెళ్లగా.. బత్తలపల్లి పీర్లకు జలధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ‘ఆల్ బిదాయో’ అంటూ విషాద గీతం ఆలపిస్తూ మకాన్కు చేరుకున్నారు.


