● జిల్లాలోని 1,71,315 మందికి
చుక్కల మందు
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
ఫైరోజాబేగం
పుట్టపర్తి అర్బన్: పల్స్ పోలియోకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజాబేగం తెలిపారు. ఈనెల 28న (ఆదివారం) పల్స్పోలియో నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గణేష్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో 0– 5 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పిల్లలు 1,71,315 మంది ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 1,011 బూత్లు ఏర్పాటు చేయడంతోపాటు 4,926 మందిని నియమించామన్నారు. ఈనెల 28న కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తారని, ఆరోజు పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం 29, 30 తేదీల్లో వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది గృహ సందర్శన చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ చెన్నారెడ్డి, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, వైద్యాధికారి డాక్టర్ గాయత్రి, డాక్టర్ సునీల్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామలక్ష్మి, సీహెచ్ఓలు వన్నప్ప, శివరాం, సూపర్వైజర్లు చంద్రకళ, రమణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.


