ప్రశాంతి నిలయం: హైదరాబాద్లోని శ్రీసత్యసాయి విద్యా విహార్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు బుధవారం సాయికుల్వంత్ సభా మందిరంలో అట్టహాసంగా నిర్వహించారు. సత్యసాయిబాబా 1976 జూన్ 24న శ్రీసత్యసాయి విద్యా విహార్ పేరుతో హైదరాబాద్లో విద్యాసంస్థను ప్రారంభించారు. ఈ విద్యాసంస్థ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీసత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు ‘దేవుడు మలిచిన శిల్పాలు’ పేరుతో నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సత్యసాయి బోధనలను, సేవా స్ఫూర్తిని విద్యా వ్యవస్థ గొప్పతనాన్ని విద్యార్థులు నృత్య రూపకం ద్వారా చక్కగా వివరించారు. కడు పేదరికాన్ని అనుభవిస్తూ విద్యా విహార్ ద్వారా చక్కటి విద్యను పొంది ఆదర్శప్రాయులుగా మారిన విధానాన్ని కళ్లకు కట్టారు. చక్కటి నృత్య భంగిమలతో నిర్వహించిన నాటిక అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యా విహార్ ఉపాధ్యాయులను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి ఘనంగా సన్మానించారు. 50 ఏళ్లలో విద్యావిహార్ సాధించిన ప్రగతిని వివరించే పుస్తకాన్ని విడుదల చేశారు. పలువురు ఉపాధ్యాయులు తమ అనుభవాలను వివరిస్తూ ప్రసంగించారు. సత్యసాయి విద్యా విహార్కు చెందిన 750 మంది ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.


