బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాలకు పేరుగాంచిన బత్తలపల్లిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చిన్నకాశీంస్వామి, పెద్దకాశీంస్వామి మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బుధవారం చిన్న సరిగెత్తు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు పీర్ల స్వాములకు పానకాలు చదివించారు. రాత్రి హిందువులు పక్కీరుబాబా దీక్ష చేపట్టారు. అనంతరం ముళ్లపొదలు, మొద్దులు తీసుకువచ్చి అగ్నిగుండాన్ని రగిలించి అలావ్ తొక్కారు. గురువారం ఉదయం గ్రామోత్సవం అనంతరం పీర్లు గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి గ్రామాలకు వెళ్లి ఆ గ్రామాల్లోని పీర్ల చావిడి వద్ద పూజలందుకుంటాయని ముజావర్లు టైలర్ రియాజ్, నజరుల్లా, మాబాషా, ఖాశీంవలి తెలిపారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో బత్తలపల్లి పీర్లకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. మొహర్రం వేడుకల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు చర్యలు తీసుకోవాలని ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ సూచించారు.


