ధర్మవరం అర్బన్: మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా మందుబాబులకు తెలియడం లేదు. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మై హోం రెస్టారెంట్ ముందు బుధవారం పూటుగా మద్యం సేవించిన వ్యక్తి నిలిపి ఉంచిన కారు వెనుక చక్రాల కింద పడిపోయాడు. స్థానికులు ఎంత పిలిచినా లేవలేదు. పొరపాటున కారు రివర్స్ చేస్తే మద్యం మత్తులోనే ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయి. విచ్చలవిడిగా బెల్టుషాపులు నిర్వహిస్తుండటంతోనే ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించి ఇలా రోడ్లపై పడిపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
11న జాతీయ లోక్ అదాలత్
అనంతపురం: జూలై 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లా కోర్టులో మేజిస్ట్రేట్లతో సమీక్ష నిర్వహించారు. లోక్ అదాలత్ దృష్టికి తీసుకరావాల్సిన కేసుల గురించి తగు సూచనలను చేశారు. ఈ సందర్భంగా మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసులపై, ఆర్థిక సంస్థల ద్వారా దాఖలు చేసిన పిటిషన్ల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగపరచుకునే విధంగా తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు సత్యవాణి, ఎన్.సత్యశ్రీ, బబ్లునాయక్, సీఎన్ మూర్తి, టి.కేశవ తదితరులు పాల్గొన్నారు.


