ఉపాధి పథకం కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. పనులే చేయకుండా ఏకంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేసినట్లు చూపుతూ కొందరు నేతలు జేబులు నింపుకుంటున్నారు. రాత్రికి రాత్రే రైతుల పొలాల్లో జేసీబీలతో గుంతలు తీసి కూలీలతో పనులు చేయించి మరికొందరు బిల్లులు చేసుకుంటున్నారు. ఇలా.. ఎవరికి దోచిన విధంగా వారు అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అధికారులకు అన్నీ తెలిసినా చూిసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు బి.రాము. కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామం. సోమవారం రాత్రి కొందరు ఆయన పొలంలోకి వెళ్లి జేసీబీలతో గుంత తవ్వించారు. తనకు తెలియకుండా పొలంలో గుంత తీశారంటూ రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారంపాండ్ కింద బిల్లులు కాజేసేందుకు గుంత తీసినట్లు చెబుతున్నాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని గ్రామంలో కొందరు టీడీపీ నేతలు ఉపాధి పనుల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. పంట వేసుకోవాల్సిన పొలంలో తనకు తెలియకుండా గుంతలు తీయిస్తే.. ఎలా అని వాపోయారు.


