
రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన
రాప్తాడు రూరల్: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రెడ్డిగారి రమేష్కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు రాప్తాడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ... ప్రజల కోసం నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను నేడు చంద్రబాబు ప్రైవేట్పరం చేస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఎగ్గొట్టారన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి వంచించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు విపరీతమైన ధనదాహంతో అక్రమ వసూళ్లు, అరాచకాలకు తెరలేపారన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై తీవ్ర వివక్ష చూపిస్తోందన్నారు.
ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలి..
తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్తో పాటు 200 హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 2–3 పథకాలు పాక్షికంగా అమలు చేశారన్నారు. కళ్లు ఆర్పకుండా అపద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలుండేవన్నారు. ఆయన వచ్చిన తర్వాత 17 కొత్త కళాశాలలను తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో ఏటా 5 వేలమంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య చదువుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాలను ఆపేసిందన్నారు. ఇప్పుడు ప్రైవేట్పరం చేసేందుకు పూనుకుందని, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దోచుకోవడంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్రంలోనే ఆల్టైం రికార్డ్ సాధిస్తోందన్నారు. ఒక్క పాపంపేటలోనే రూ.వేల కోట్ల విలువైన 500 ఎకరాలకు పైగా శోత్రియం భూములను తన బంధువుల పేరుపై అక్రమంగా జీపీఏ చేయించుకున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేయడం వల్ల నియోజకవర్గంలో భూగర్భజలాలు అడుగంటి 2 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతోందన్నారు. పరిటాల సునీత ఇచ్చిన లేఖ వల్ల 50 వేల పేదల గృహ నిర్మాణాలు ఆగిపోయాయన్నారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుప్రసాద్, రాప్తాడు ఎంపీపీ వరలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, పార్టీ మండల కన్వీనర్లు గోవిందరెడ్డి, పవన్, ఎంపీటీసీ సభ్యులు సునీల్దత్తరెడ్డి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విపరీతమైన ధనదాహంతో
టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను
కాపాడుకుందాం
వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్
పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి
ప్రభుత్వ తీరును ఎండగడదాం :
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి