
పంపిణీ రెండురోజులే!
పుట్టపర్తి అర్బన్: పింఛన్ పంపిణీపై కూటమి సర్కార్ ఆంక్షలు విధించింది. రెండు రోజులు మాత్రమే గడువు విధించింది. 1, 2 తేదీల్లో ఏదైనా కారణంతో పింఛన్ అందుకోకపోతే మరుసటి నెలలో పింఛన్ మొత్తం అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో వివిధ జబ్బులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, బతుకుదెరువుకు వలస వెళ్లిన వారు..పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల కోసం బంధువుల ఊళ్లకు వెళ్లిన వారికి పింఛన్ మొత్తం అందని పరిస్థితి నెలకొంది. కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులంతా పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందించేవారని గుర్తు చేసుకుంటున్నారు.
టీడీపీ నేతల ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ!
జిల్లాలో 2,64,665 మంది పింఛన్ లబ్ధిదారులుండగా... శుక్రవారం సచివాలయ, రైతు సేవా కేంద్రాలు, వెలుగు సిబ్బంది సుమారు 4 వేల మంది సాయంత్రానికి 2,45,009 మందికి పింఛన్ మొత్తం అందించారు. ఇంకా దాదాపు 20 వేల మంది పింఛన్ అందుకోలేకపోయారు. వీరంతా శనివారం అందుబాటులో ఉండి పింఛన్ మొత్తం తీసుకోవాలి. లేకపోతే 30 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, శుక్రవారం చాలా గ్రామాల్లో టీడీపీ నాయకుల ఇళ్లవద్దే పింఛన్ పంపిణీ చేశారు. మరికొన్ని చోట్ల మాత్రం సచివాలయాలు, రచ్చకట్టల వద్ద పింఛన్ మొత్తం అందజేశారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బదిలీలతో ఇబ్బందులు..
సాధారణ బదిలీల్లో భాగంగా సచివాలయ ఉద్యోగులంతా గతనెలలో కొత్త స్థానాలకు వచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు. వారి ఇళ్లు ఎక్కడ అని తెలుసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు తమ ఇళ్ల వద్దకు పిలవడంతో సిబ్బంది అక్కడికే వెళ్లి పింఛన్ అందించారు.
మార్గదర్శకాల మేరకే..
పింఛన్ పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా 1,2 తేదీల్లో పింఛన్ పంపిణీ చేస్తాం. ఆయా రోజుల్లో పింఛన్ తీసుకోని వారికి తర్వాత నెల అందిస్తాం. అందువల్ల లబ్ధిదారులంతా అందుబాటులో ఉండి పింఛన్ తీసుకోవాలి. – నరసయ్య, పీడీ, డీఆర్డీఏ
సకాలంలో తీసుకోకపోతే
పింఛన్ కోసం నెలరోజులు ఆగాల్సిందే
కూటమి సర్కార్ తీరుపై
పింఛన్దారుల పెదవి విరుపు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి, వలస జీవులకు పింఛన్ కష్టమే!