
కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
కళ్యాణదుర్గం: ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నేతృత్వంలోని బృందం శుక్రవారం కూడా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు కొనసాగించింది. గురువారం రాత్రి నాగేంద్ర నాయక్ నుంచి భూమి కన్వర్షన్కు రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా అనంతపురంలో ఏసీబీ అధికారులు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని పట్టుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రాత్రే కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన అధికారులు రెండో రోజూ కార్యాలయంలో కీలక ఫైళ్లను తనిఖీ చేశారు. ఇటీవల చేసిన భూముల కన్వర్షన్, మున్సిపాలిటీ పరిధిలో చేసిన రిజిస్ట్రేషన్ తదితర ఫైళ్లను పరిశీలిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కన్వర్షన్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన ఫైళ్లు.. డబుల్ రిజిస్ట్రేషన్లు.. ఇటీవల పలువురు తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి సృష్టించిన డాక్యుమెంట్లకు సంబంధించిన కీలక ఫైళ్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటిని కర్నూలుకు తీసుకెళ్లనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు తెలిపారు.