
సాగుభారం
పుట్టపర్తి అర్బన్: భూమితల్లినే నమ్ముకున్న రైతన్నకు వ్యవసాయం భారంగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నాటికి ఇటు పంట పెట్టుబడులు, అటు పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు కలిపి తడిసిమోపెడవుతున్నాయి. ఆర్థికంగా అండగా నిలిచి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండగా.. చాలా మంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. అప్పటికీ అవసరాలు తీరని వారు బంగారాన్ని బ్యాంకుల్లో, ప్రైవేటు ఫైనాన్సుల్లో తాకట్టు పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు అనుకున్న వారు కాడి కింద పడేసి బతుకుదెరువు కోసం వలస పోతున్నారు.
ఎరువులు, విత్తనాల ధరలకు రెక్కలు
ఎరువులు, విత్తనాల ధరలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. కనీసం రాయితీపై ఇచ్చే విత్తనమైనా వేద్దామంటే నాసిరకంగా ఉంటోంది. పైగా ఎంత భూమి ఉన్నా మూడు బస్తాల వేరుశనగతోనే ప్రభుత్వం సరిపెడుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు మార్కెట్లో కిలో వేరుశనగ విత్తనం రూ.130 వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఇక ఎరువుల ధరలూ అమాంతం పెరిగిపోవడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.
కాడెద్దులూ బరువై
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల వద్ద ఉన్న కాడెద్దులూ భారంగా మారాయి. దీంతో వాటిని మార్కెట్కు తరలించి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ చాలా మంది రైతులు కాడెద్దుల బండితో ఇసుక తోలుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారు. కూటమి ప్రభుత్వం ట్రాక్టర్లను మాత్రమే అనుమతించడంతో ఎద్దులు భారంగా మారాయి.
పెరిగిన సాగు ఖర్చులు
పొలం దున్నేందుకు గతంలో ట్రాక్టర్కు ఒక గంటకు రూ.800 తీసుకునేవారు. ప్రస్తుతం రూ.1,000 వరకూ వసూలు చేస్తున్నారు. గతంలో రోజుకూలి రూ.250 ఉండగా.. ఇపుడు రూ.400 వరకూ తీసుకుంటున్నారు. విత్తనం వేసేందుకు, కలుపు మందులు, పురుగు మందులు..ఇలా అన్ని ఖర్చులూ పెరిగాయి. దీంతో ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ సాగుకు చేయాలంటే రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు అవుతోంది. గతంలో మొక్క జొన్న పంట సాగుకు ఎకరాకు రూ.15 వేలు మాత్రమే ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.25 వేలకు పెరిగింది. కంది సాగు సైతం ప్రస్తుతం భారమైంది. డబ్బుకు వెనకాడకుండా ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చివర్లో ‘మద్దతు’ దక్కక పంటను మూడు దుడ్లకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ఆదుకోని కూటమి సర్కార్
పంటల సాగుకు రైతులు నానా కష్టాలు పడుతున్నా...కూటమి సర్కారు ఈ ఏడాది కాలంలో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాలు మాఫీ, చేదోడు తదితర పథకాలతో ప్రతి నెలా.. ప్రతి ఇంటికీ డబ్బు జమ చేస్తూ వచ్చారు. రైతులకు ఉచితంగా పంటల బీమా వర్తింపజేసి ఆదుకున్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం పంటల బీమా కూడా ఉచితంగా చేయడం లేదు. వేరుశనగకు ఎకరాకు రూ.640, మొక్కజొన్న రూ.660, కందికి రూ.400 చొప్పున కట్టించుకుని పంటల బీమా చేయిస్తోంది. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు పంటల బీమా తోడైంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులూ ఇప్పటి వరకూ అందించలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతును నిలువుదోపిడి చేస్తోంది తప్ప... ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పెట్టుబడులు..దక్కని ‘మద్దతు’
నేటికీ అందని ‘అన్నదాత సుఖీభవ’
అందినకాడికి అప్పులు చేస్తున్న అన్నదాత
బ్యాంకుల్లోనూ బంగారం తాకట్టు పెడుతున్న వైనం
సాగు ఖర్చులు పెరిగాయి
ఏటా పంటల సాగుకయ్యే ఖర్చులు పెరుగుతున్నా... గిట్టుబాటు ధరలు లేక నష్టాలు వస్తున్నాయి. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతు బతుకుతాడు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. పంటల కోత సమయానికంటే ముందే గిట్టుబాటు ధరలు కల్పించి ప్రతి పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. గతంలో ఎకరా వేరుశనగ సాగుకు రూ.20 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడది రూ.50 వేలకు చేరింది.
– నాగభూషణ, రైతు, పెడపల్లి
వాతావరణం అనుకూలిస్తేనే..
ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసినా... వాతావరణం అనుకూలిస్తే పంట చేతికొస్తుంది. లేదంటే రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక వేళ అదృష్టం బాగుండి పంట చేతికి అందినా..గిట్టుబాటు ధర లభించక నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతు వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం సాయంగా నిలవాలి. మార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలి. లేకపోతే రైతు బతుకు దుర్భరమవుతుంది.
– లక్ష్మీనారాయణరెడ్డి, జగరాజుపల్లి

సాగుభారం

సాగుభారం

సాగుభారం

సాగుభారం