
అల్పాహారం.. నిత్యన్నదానం
● ఖాద్రీశుని ఆలయంలో
భక్తులకు సౌకర్యాలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అల్పాహారంలో భాగంగా సోమవారం వెజిటబుల్ ఉప్మా, పల్లీల చట్నీ, మంగళవారం ఉగ్గాని, పల్లీల చట్నీ, బుధ, శుక్రవారాల్లో బిస్బిల్లా బాత్, గురువారం వెజిటబుల్ ఉప్మా, పల్లీల చట్నీ, శని, ఆదివారాలు పెసర పప్పు పొంగలి, సాంబర్ అందిస్తామన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా రుచికరమైన పదార్థాలతో వడ్డించనున్నట్లు ఈఓ వెల్లడించారు. అంతేకాకుండా స్వామి దర్శనం కోసం వచ్చే బాలింతలు పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది, వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్ సౌకర్యం కల్పించామన్నారు. ఇక వయోవృద్ధులు, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు.
ఎంటీఎస్ టీచర్ల
సర్దుబాటుకు గ్రీన్సిగ్నల్
అనంతపురం ఎడ్యుకేషన్: అవసరమైన పాఠశాలలకు 1998, 2008 ఎంటీఎస్ టీచర్లను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ ఈనెల 20లోగా పూర్తి చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముందుగా సీనియార్టీ జాబితాను తయారు చేయనున్నారు. సీనియార్టీని అనుసరించి అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తామని డీఈఓ ఎం.ప్రసాద్బాబు తెలిపారు.
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
● దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడం తప్పా?
● పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి
వ్యతిరేకం
● మండిపడిన బీఎస్పీ నాయకులు
రామగిరి: తీవ్ర అన్యాయానికి గురైన దళిత మైనర్ బాలిక కుటుంబం కనీసం పరామర్శకు కూడా నోచుకోకుండా కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని, ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో నిజంగానే రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్లు తెలుస్తోందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు సిందనూరు నాగరాజు, గద్దల నాగభూషణం అన్నారు. రామగిరి మండలంలోని ఏడుగుర్రాల పల్లిలోని ఓ దళిత బాలికపై 14 మంది కీచకులు నెలలపాటు దాష్టీకానికి పాల్పడగా ఆ చిన్నారి గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలిక అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం బీఎస్పీ నేతల బృందం ఏడుగుర్రాలపల్లికి బయలుదేరింది. అయితే పోలీసులు బీఎస్పీ నేతల బృందాన్ని ఎన్ఎస్ గేట్లో అడ్డుకుని చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. ముందస్తు అనుమతి లేనిదే ఏడుగుర్రాలపల్లికి అనుమతించబోమన్నారు. దీనిపై బీఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరునికీ కల్పించిందన్నారు. పోలీసులు పాలకులకు వంత పాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. దళిత బాలికపై దాష్టీకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వం... ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు, బైనేని శ్రీనివాసరాజు, అంకె కుళ్లయప్ప, హరిప్రసాద్, నాగసుబ్బరాయుడు, శీన, కుంచె గోపాల్, నాగమ్మ, జయచంద్ర, కృష్ణ, రాజు, గంగాధర్, లింగరాజు, హనుమంతప్ప, నాగరత్నమ్మ, శశికళ, నాగవేణి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

అల్పాహారం.. నిత్యన్నదానం