సాంకేతిక సాకు.. తిరకాసు | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక సాకు.. తిరకాసు

Jun 19 2025 4:26 AM | Updated on Jun 19 2025 4:26 AM

సాంకే

సాంకేతిక సాకు.. తిరకాసు

అనంతపురంలోని తపోవనంలో నివాసముంటున్న దామోదరరెడ్డి ఇటీవల 4 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు రామ్‌నగర్‌లోని ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ని కలిశాడు. అతను స్టాంప్‌ వెండర్‌ దగ్గరకు పిలుచుకెళ్లి స్టాంపులు కావాలని అడిగితే స్థలం విలువలో 6.5శాతం స్టాంప్‌ డ్యూటీని స్టాక్‌ హోల్డ్‌ ఏజెన్సీ పేరిట చలానా తీస్తే ఈ–స్టాంపు ఇస్తామన్నాడు. దీంతో ఏజెన్సీ పేరిట చలానా తీసే సమయంలో ఖాతాలో నగదు కట్‌ అయింది కానీ, చలానా రాకుండా హోల్డ్‌లోకి వెళ్లింది. దీంతో దాదాపు రూ.40వేలకు పైగా నగదు అలాగే నిలిచిపోయింది.

అనంతపురం టౌన్‌: భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో స్థలం విలువలో స్టాంప్‌ డ్యూటీ కింద 6.5శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 1 శాతం, యూజర్‌ ఛార్జీల కింద రూ.550 చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాలన్నింటినీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ష్రేన్‌ శాఖకు చలానా రూపంలో వినియోగదారులు చెల్లించాలి. అయితే ప్రస్తుతం నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంప్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించిన ఈ–స్టాంపుల విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ సాంకేతిక సాకును తమకు అనుకూలంగా మార్చుకున్న ఏజెన్సీ నిర్వాహకులు తిరకాసులు పెడుతూ స్టాంపు వెండర్లకు ఈ–స్టాంపుల స్టాక్‌ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. స్టాంప్‌ డ్యూటీ మొత్తాన్ని స్టాక్‌ హోల్డ్‌ ఏజెన్సీ, భూపాళం కాంప్లెక్స్‌, కర్నూలు పేరిట చలానా తీస్తేనే ఈ–స్టాంపులు ఇస్తామని వెండర్లకు మెలిక పెడుతున్నారు. ఏజెన్సీ పేరుతో చలానా తీసే సమయంలో ఖాతాలోని నగదు హోల్డ్‌ పడితే ఎవ్వరిని అడగాలి? ఖాతా నుంచి కట్‌ అయిన నగదు తిరిగి ఖాతాలో జమ అవుతుందా? వీటికి స్టాక్‌ హోల్డ్‌ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు.

ఒక్కరికే ఈ–స్టాంపులు

రామ్‌నగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సమీపంలోని ఓ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకుడికి మాత్రమే అధీకృత ఈ–స్టాంప్‌లను కర్నూలులోని స్టాక్‌ హోల్డ్‌ ఏజెన్సీ నిర్వాహకులు అందిస్తున్నారు. దీంతో ఈ–స్టాంపుల కోసం సీఎస్‌సీ కేంద్రం వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని సదరు కేంద్రం నిర్వాహకుడు అధిక ధరకు ఈ–స్టాంప్‌లు విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. రూ.100 విలువ చేసే స్టాంపును రూ.150 నుంచి రూ.180 వరకు అవసరాన్ని బట్టి నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రూ.50 విలువ చేసే ఈ–స్టాంప్‌ను రాప్తాడుకు చెందిన ఓ వ్యక్తి రెట్టింపు ధరతో కొనుగోలు చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పట్టించుకోని అధికారులు:

ఈ–స్టాంపుల అధిక ధర విక్రయాలను అడ్డుకోవాల్సిన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో స్టాంప్‌ల విక్రయదారులు ఆడింది ఆట... పాడింది పాటగా వ్యవహరిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు. నగరంలో ఒక్కరికే ఈ–స్టాంప్‌ల విక్రయానికి అనుమతులు ఇవ్వడంతో ఆయన చెప్పిందే ధరగా మారింది. లేదంటే స్టాంపులు లేవంటూ నిర్లక్ష్యంగా వెనక్కు పంపించేస్తాడు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయంలోని స్టాంపుల విక్రయ కేంద్రాన్ని మూసి ఇప్పటికే ఏడాది కావస్తోంది. దీంతో స్టాంపుల కోసం అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

స్టాంప్‌ వెండర్లను ఇబ్బందులకు గురి చేస్తున్న స్టాక్‌ హోల్డ్‌ ఏజెన్సీ

ఏజెన్సీ పేరిట చలానా తీస్తేనే ఈ–స్టాంపులంటూ మెలిక

చలానా తీసే సమయంలో నగదు హోల్డ్‌లో పడి నష్టపోతున్న వినియోగదారులు

నగరంలో కేవలం ఒకరికే స్టాంపుల సరఫరా

దందాకు తెరలేపిన సదరు స్టాంప్‌ వెండర్‌

పట్టించుకోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ

చర్యలు తీసుకుంటాం

స్టాక్‌ హోల్డ్‌ కార్పొరేషన్‌ ఏజెన్సీ నుంచి జిల్లాలోని స్టాంప్‌ వెండర్లందరికీ స్టాంపులు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో నెలకొన్న స్టాంపుల కొరత సమస్యపై ఉన్నతాధికారులతో చర్చించాం. అన్ని రకాల స్టాంపులను రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అందుబాటులోకి తీసుకువస్తాం. – భార్గవ్‌, జిల్లా రిజిస్ట్రార్‌

సాంకేతిక సాకు.. తిరకాసు 1
1/2

సాంకేతిక సాకు.. తిరకాసు

సాంకేతిక సాకు.. తిరకాసు 2
2/2

సాంకేతిక సాకు.. తిరకాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement