‘యోగాంధ్ర’ను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘యోగాంధ్ర’ను విజయవంతం చేయండి

Jun 19 2025 4:26 AM | Updated on Jun 19 2025 4:26 AM

‘యోగాంధ్ర’ను  విజయవంతం చేయండి

‘యోగాంధ్ర’ను విజయవంతం చేయండి

ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ నిర్వహించే ‘యోగాంధ్ర’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహణ, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర, తల్లికి వందనం తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 21న జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో నిర్వహిస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది యోగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈ మూడో శనివారం యోగా థీమ్‌తో నిర్వహించాలన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి వీలైనంత త్వరగా ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

బదిలీ తహసీల్దార్‌

మళ్లీ విధుల్లోకి!

12న బుక్కపట్నం తహసీల్దార్‌ షాబుద్దీన్‌ బదిలీ

బుధవారం మళ్లీ బుక్కపట్నంలోనే విధులు

పుట్టపర్తి: సాధారణ బదిలీల్లో భాగంగా ఈ నెల 12న తనకల్లు మండలానికి బదిలీ అయిన తహసీల్దార్‌ షాబుద్దీన్‌ కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే మళ్లీ బుక్కపట్నంలో ప్రత్యక్షమయ్యారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడకుండానే బుధవారం ఆయన డిప్యూటీ తహసీల్దార్‌ నుంచి బాధ్యతలు తీసుకుని విధులు నిర్వర్తించడం చర్చనీయాంశమైంది.

అక్కడ వద్దన్నారనీ...

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే ఉద్యోగుల బదిలీలు జరిగాయి, ఈక్రమంలోనే ఏడాది క్రితం బుక్కపట్నం తహసీల్దార్‌గా షాబుద్దీన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆయన్ను తనకల్లు మండలానికి బదిలీ చేశారు. అతని స్థానంలో ఇక్కడే విధులు నిర్వహిస్తున్న డీటీ నరసింహులుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో షాబుద్దీన్‌.. డీటీ నరసింహులుకు చార్జ్‌ ఇచ్చారు. అయితే షాబుద్దీన్‌ విధుల్లో చేరకుండా అక్కడి ముఖ్య నాయకుడు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో షాబుద్దీన్‌ బుధవారం బుక్కపట్నం కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తహసీల్దార్‌ సీట్లో కూర్చుని విధులు నిర్వర్తించారు. డిజిటల్‌ కీ ద్వారా ఎడాపెడా సంతకాలు చేసేశారు. ఇంతకీ షాబుద్దీన్‌ను తిరిగి బుక్కపట్నం తహసీల్దార్‌గా బదిలీ చేశారా...లేక రాజకీయ నేతల అండతో అతను దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారా అన్నది కార్యాలయ అధికారులకే అంతబట్టడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు రెవెన్యూ ఉన్నతాధికారులను ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement