
వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వ సౌలభ్యాలు
గోరంట్ల: ప్రకటించిన మేరకు వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వ సౌలభ్యాలు అందజేస్తున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అమరుడైన గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50లక్షల చెక్తో పాటు ఐదు ఎకరాల పొలం, ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను మంగళవారం మంత్రి అందజేసి, మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయితో మాట్లాడారు. మురళీనాయక్ ఇంటి నుంచి సమాధి వరకూ సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.16 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గోరంట్లలో మురళీనాయక్ స్మారక వనం, జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గోరంట్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ మారుతి, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం
మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సవిత కార్యక్రమాలకు స్థానిక బీజేపీ నేతలను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ మండల కన్వీనర్ భోయ లక్ష్మీనారాయణ అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేరుకే కూటమి ప్రభుత్వం ఉందని, క్షేత్రస్థాయిలో కూటమిలో భాగమైన బీజేపీ నాయకులకు టీడీపీ నేతలు ఏ మాత్రం గౌరవించడం లేదని మండిపడ్డారు. అభివృద్ది పనులకు కేంద్ర ప్రభుత్వ నిధులు వెచ్చిస్తుండగా.. బీజేపీ నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా అంతా తమ గొప్పగానే ప్రకటించుకునే ప్రయత్నాలు చేయడం ఇప్పటికై నా మానుకోవాలని మంత్రి సవితకు ఆయన హితవు పలికారు.