
రైతులపై బీమా బండ
● కూటమి సర్కారు ఘనకార్యం ● ప్రీమియం చెల్లింపునకు ఎగనామం
● ఉచిత పంటల బీమాతో వైఎస్ జగన్ హయాంలో రైతులకు భారీగా పరిహారం
● గతంలో 14.20 లక్షల మందికి రూ.1,883 కోట్ల ధీమా
అనంతపురం అగ్రికల్చర్: కరువు రైతులపై కూటమి సర్కారు పంటల బీమా బండ వేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి రైతులపై ప్రీమియం భారం మోపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్లో రూ.150 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియం కట్టించుకుంటాయి. మిగతా రైతులు సీఎస్సీ సెంటర్లలో ప్రీమియం కట్టి నమోదు చేయించుకోవాలి. నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్లో నమోదైన రైతులు బీమా పథకాల పరిధిలోకి రానున్నారు. అయితే, దీనిపై జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం గమనార్హం.
జిల్లాలో 12 పంటలకు..
క్లస్టర్ పరిధిలో ఉన్న అనంతపురం జిల్లాలో వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, అరటి, చీనీ, దానిమ్మ, టమాట పంటలను చేర్చారు. అన్నింటినీ మండలం యూనిట్గా తీసుకుంటారు. వేరుశనగ హెక్టారుకు రూ. 80 వేలు, పత్తి రూ.95 వేలు, అరటికి రూ. 1.50 లక్షలు, చీనీకి రూ.1,37,500, దానిమ్మకు రూ.1,87,500, టమాటకు రూ.80 వేలు బీమా పరిహారంగా ఖరారు చేశారు. జూలై 15లోపు రైతులు తమ వాటా కింద ప్రీమియం చెల్లించాలి. ఆటోమేటిక్ వెదర్బేస్డ్ స్టేషన్లలో నమోదైన వర్షపాతం, వాతావరణం, గాలిలో తేమశాతం, చీడపీడలు సోకే వాతావరణం తదితర వివరాల ఆధారంగా బీమా పరిహారం లెక్కకట్టనున్నారు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో వాతావరణ బీమా అమలు కానుంది. ఇక ప్రధానమంత్రి ఫసల్బీమాలో క్లస్టర్ –1 కింద గుర్తించిన అనంతపురం జిల్లాలో గ్రామం యూనిట్గా కంది పంటను చేర్చారు. మండలం యూనిట్ కింద వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, ఎండుమిరప పంటలకు వర్తింపజేశారు. కంది హెక్టారుకు రూ.50 వేలు, వరికి 1.02 లక్షలు, జొన్నకు రూ.52,500, మొక్కజొన్నకు రూ.82,500, ఆముదంకు రూ.50 వేలు, ఎండు మిరపకు రూ.2.25 లక్షలు బీమా పరిహారంగా ఖరారు చేశారు. వరి పంటకు ప్రీమియం ఆగస్టు 15 లోపు చెల్లించాలి. మిగతా పంటలకు జూలై 31న ఆఖరు తేదీగా నిర్ణయించారు. పంట కోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడుల ఆధారంగా పరిహారం లెక్కిస్తారు. ఈ క్రమంలో కందిలో అత్యధికంగా 846 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నారు. అలాగే వరిలో 96, జొన్నలో 36, మొక్కజొన్నలో 72, ఆముదంలో 36, ఎండుమిరప పంటలో 36 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో 10 పంటలకు..
శ్రీ సత్యసాయి జిల్లాలో వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, టమాట, చీనీ, దానిమ్మ పంటలకు వర్తింపజేశారు. ఇఫ్కో టోకియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అమలు చేయనుంది. ఫసల్బీమా కింద శ్రీ సత్యసాయి జిల్లాలో కంది పంటను గ్రామం యూనిట్గా తీసుకున్నారు. వరి, మొక్కజొన్నను మండలం యూనిట్గానూ, ఆముదం, రాగి పంటలను జిల్లా యూనిట్గా తీసుకున్నారు. కందిలో 720 పంట కోత ప్రయోగాలు, మొక్కజొన్నలో 84, వరిలో 36, రాగిలో 26, ఆముదంలో 26 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నారు. అనంతపురం జిల్లా మాదిరిగా బీమా పరిహారం, ప్రీమియం చెల్లింపు, కటాప్ తేదీ నిర్ణయించారు.
వైఎస్ జగన్ హయాంలో హాయిగా...
2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎలాంటి ప్రీమియం భారం పడకుండా ఉచితంగా పంటల బీమా పథకాలు అమలు చేయడంతో హాయిగా సాగిపోయింది. నిబంధనల మేరకు పరిహారం కూడా ఇవ్వడంతో రైతులకు భారీగా లబ్ధిచేకూరింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 14.20 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.1,883 కోట్లు బీమా పరిహారం జమ అయింది. ప్రీమియం రూపంలో ఏటా ఉమ్మడి జిల్లా రైతులకు రూ.150 కోట్ల వరకు ఆదా కావడం గమనార్హం. ఇపుడు ప్రీమియం బండ పడటంతో పాటు నిబంధనల మేరకు పరిహారం ఇచ్చి న్యాయం చేయడంపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.