
కాంట్రాక్టర్లకు దండి.. ఖజానాకు గండి!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మైనింగ్ మాఫియాకు స్వయానా సర్కారే ఊతమిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికే యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్, క్వార్ట్జ్ ఖనిజాలను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్న బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన జీఓ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘రోడ్డు నిర్మాణ పనుల్లో తవ్విన మట్టిని ఎక్కడికై నా తోలుకోండి, పైసా కట్టక్కర లేదు’ అన్న రీతిలో ఇచ్చిన జీఓ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రహదారి నిర్మాణ కాంట్రాక్టర్లకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లుగా తెలుస్తోంది.
కోట్లాది రూపాయల నష్టం
ఈ ఏడాది జనవరి 20న జీఓ నం.6ను ప్రభుత్వం విడుదల చేసింది. కాంట్రాక్టర్లకు రూ.కోట్లకు కోట్లు దోచిపెట్టే జీఓగా దీన్ని అభివర్ణిస్తున్నారు. గతంలో ఏవైనా పనుల నిమిత్తం రోడ్డులో తవ్విన మట్టిని ఆ సమీపంలోనే ఏర్పడిన గుంతలను పూడ్చడానికి, అక్కడే ఇతర అవసరాలకు వాడుకోవాలనే నిబంధన ఉండేది. మట్టిని ఏదైనా కారణాలతో లారీ లేదా టిప్పర్ల ద్వారా అర కిలోమీటరు దూరం తరలించినా సీనరేజీ కట్టాల్సి ఉండేది. అయితే, కూటమి సర్కారు ఇచ్చిన జీఓ ప్రకారం ఇందుకు మినహాయింపు ఉంటుంది. మట్టిని ఎక్కడికై నా తరలించుకోవచ్చు. దీంతో సదరు కాంట్రాక్టర్లు భారీగా గుంతలు తవ్వుతూ ఆ మట్టిని ఇతర పనులకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో సహజ వనరులు లూటీ కావడం ఒకెత్తయితే, సర్కారుకు సీనరేజీ రూపంలో వచ్చే ఆదాయంలో భారీగా కోత పడిందని మైనింగ్ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.3,200 కోట్ల పనులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం నుంచి మొదలుపెడితే తాడిపత్రి వరకూ రూ.3,200 కోట్లతో వివిధ మార్గాల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. పుట్టపర్తి, పెనుకొండ, గుత్తి ఇలా పలు రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనుల ద్వారా మట్టిని తరలిస్తే కనీసం రూ.130 కోట్లకు పైనే సీనరేజీ వస్తుందని అధికారుల అంచనా. కానీ తాజా జీఓతో ఒక్క పైసా రాలేదు. ఉదాహరణకు శింగనమల వద్ద పనులు జరుగుతుంటే ఆ మట్టిని కదిరివైపు తరలిస్తున్నారు. ఇలా పనులు ఒక చోట, మట్టిని మరోచోటుకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
భారీగా ముడుపులు
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ఈ జీఓకు సంబంధించి కూటమి సర్కారు పెద్దలకు భారీ ముడుపులు అందినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్లలో సీనరేజీ నష్టపోతున్న పరిస్థితుల్లో... ముఖ్య నేతలకు రూ.కోట్లలో ముడుపులు చెల్లించి జీఓ విడుదల చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనరేజీ చార్జీలు లేకపోవడంతో ఖజానాకు భారీ నష్టం చేకూరుతోంది.