● దొంగ ఓట్లను అడ్డుకుందాం
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
కొడవలూరు: ‘వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. బీఎల్ఏలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి ఓటును కాపాడుకుందాం’ అని మాజీ మంత్రి, ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నార్తురాజుపాళెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో బీఎల్ఏలతో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డితో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ చంద్రబాబుకు దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఉందన్నారు. అందువల్ల దొంగ ఓట్ల చేరికపై కూడా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. ఏ ఒక్క ఓటు తొలగింపునకు గురికాకుండా చూసుకోవల్సిన బాధ్యత బీఎల్ఏలపైనే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐర్లో ప్రతి ఓటు నూతనంగా నమోదు చేయడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఓటు ఉందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే అది గల్లంతవుతుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు సూచించిన వారినే బీఎల్ఏలుగా పెట్టడం జరిగిందన్నారు. వచ్చే నెల 14వ తేదీ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బీఎల్ఏలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్లను కాపాడుకుంటూనే దొంగ ఓట్ల చేరికను అడ్డుకోవాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఎంపీపీ గాలి జ్యోతి, నాయకులు అడపాల మోహనకృష్ణ, కొట్టే మల్లికార్జున, ఎండీ కరిముల్లా, చక్కా మనోహర్, బి.సుప్రియ, కె.మోహన్రావు, సతీష్ రెడ్డి, షాహుల్, అనపల్లి ఉదయ్ భాస్కర్, బొచ్చు శ్రీనివాసులు, దేవనబోయిన శివకుమార్, వెంకటసతీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


