● డీఆర్వో విజయ్కుమార్
నెల్లూరురూరల్: ‘ఈనెల 21వ తేదీన జరిగే నీట్ – 26కు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలి’ అని డీఆర్వో విజయ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలో 9, గూడూరు పట్టణ పరిధిలో 3 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో రాష్ట్ర పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర రక్షక పోలీసు దళాల పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే తనిఖీ చేసి మౌలిక వసతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సహా ఎవరూ మొబైల్ ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు, వైద్య, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాల వివరాలు
నెల్లూరు నగర పరిధిలో దర్గామిట్టలోని డీకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), డీసీఆర్ జెడ్పీ హైస్కూల్ (బాలురు), డీసీఆర్ జెడ్పీ హైస్కూల్ (బాలికలు), కొత్తూరులోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, స్టోన్హౌస్పేటలోని ఆర్ఎస్ఆర్ఎం సీహెచ్సీ స్కూల్, వైవీఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, ఏసీ నగర్లోని ఎంఎస్ఎంఎం హైస్కూల్, గూడూరు పట్టణ పరిధిలో తిలక్ నగర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సనత్నగర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు కేంద్రాలుగా ఉన్నాయి.


