
నకిలీ ఇళ్ల పట్టాల కలకలం
సీతారామపురం: ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమాయకులకు అంటగడుతున్న వైనం సీతారామపురంలో వెలుగులోకొచ్చింది. గ్రామంలోని సర్వే నంబర్ 240లోని ప్రభుత్వ భూమికి ఓ ప్రబుద్ధుడు నకిలీ నివేశన పట్టాలు సృష్టించి అమాయకులకు అంటగట్టాడు. ఒక్కొక్కరికీ 3 సెంట్లు చొప్పున 40 మందికి నివేశన పట్టాలను తయారుచేసి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.25 వేలు చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా పలువురి నుంచి అతను సుమారు రూ.10 లక్షల మేరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇంటి నివేశన పత్రం ఉదయగిరి మండలానికి సంబంధించినది కాగా,ఆ పత్రంపై వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి ఉన్నాయి. స్టాంపులు మాత్రం సీతారామపురం తహసీల్దార్ కార్యాలయానివి వేసి ఉన్నారు. నకిలీ పట్టాల విషయం ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో నివేశన పట్టాలు నకిలీవని తెలుసుకున్న పలువురు బాధితులు సదరు వ్యక్తిని నిలదీయగా పట్టా కాగితాలు తిరిగి ఇచ్చేయండి, మీ నగదు మీకు చెల్లిస్తానంటూ బుకాయిస్తున్నట్లు సమాచారం. మండలంలో ఇలాంటి మాయగాళ్లు నిత్యం మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వారి దర్పాన్ని ప్రదర్శిస్తూ రెవెన్యూ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి ఈ తతంగం సాగిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, పోలీసులు ఈ నకిలీ పట్టాలపై నిగ్గుతేలిస్తే మాయగాళ్ల లీలలు మరెన్నో బయటకు వచ్చే అవకాశం ఉంది.
సీతారామపురంలో
40 మందికి పంపిణీ
సోషల్ మీడియాలో
వైరల్ అవుతున్న వైనం