
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో (India vs Australia) టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది.
96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది. వీరిద్దరు ఔటయ్యాక స్కోర్ కాస్త నెమ్మదించింది. హర్లీన్ డియోల్ (38), కెప్టెన్ హర్మన్ప్రీత్ (22), జెమీమా రోడ్రిగెజ్ (33), రిచా ఘోష్ (32), అమన్జోత్ కౌర్ (16) అడపాదడపా మెరుపులు మెరిపించారు. టెయిలెండర్లు దారుణంగా విఫలమయ్యారు. వీరు కూడా తలో చేయి వేసి ఉంటే టీమిండియా ఇంకాస్త భారీ స్కోర్ చేసుండేది. 21 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలా ఒకటి, శ్రీ చరణి డకౌటయ్యారు. స్నేహ్ రాణా 8 పరుగులతో అజేయంగా నిలిచింది.
ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్ల్యాండ్ 5 వికెట్లతో సత్తా చాటగా.. సోఫీ మోలినెక్స్ 3, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో మంధన పలు రికార్డులు నెలకొల్పింది. 18 పరుగుల స్కోర్ వద్ద ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆమె.. వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది.
అలాగే అర్ద సెంచరీ తర్వాత వన్డేల్లో 5000 పూర్తి చేసుకున్న మంధన.. బంతులు, ఇన్నింగ్స్ల పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్లు, 5569 బంతులు అవసరమయ్యాయి. ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29 ఏళ్లు) సొంతం చేసుకున్న ప్లేయర్గానూ మంధన రికార్డు నెలకొల్పింది.
వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.
చదవండి: భారత్తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం