Wimbledon 2021: బూట్లు మరిచిపోయి కోర్టులోకి .. ఆడుకున్న నెటిజన్లు

Wimbledon 2021: Nick Kyrgios Forgets His Tennis Shoes Before Match - Sakshi

లండన్‌: వింబుల్డన్‌ 2021లో భాగంగా శనివారం జరిగిన ఓ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ ఫెలిక్స్, కెనెడా ఆటగాడు 16వ సీడ్‌ అగర్ అలియాస్సిమ్‌ మధ్య జరగాల్సిన మూడో రౌండ్‌ మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. నిక్ కిర్గియోస్.. తన గ్రాస్‌ కోర్ట్ బూట్లను లాకర్‌లో పెట్టి మర్చిపోయి కోర్టులోకి వచ్చేయడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే.. నిక్‌, తన మూడవ రౌండ్ మ్యాచ్‌ కోసం అన్నీ సిద్ధం చేసుకుని కోర్టులోకి ఎంటరయ్యాడు. తీరా చూస్తే.. అతను తన గ్రాస్ కోర్ట్ షూస్‌కు బదులు సాధారణ బూట్లతో బరిలోకి దిగాడు. దీంతో వార్మప్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. 

దీనిపై వెంటనే స్పందించిన అతను.. ‘దుస్తులు, రాకెట్లు తనతో పాటు తెచ్చుకుని, బూట్లను మాత్రం లాకర్‌లో మర్చిపోయాను..’ అంటూ నవ్వుతూ అసలు విషయం చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళా స్టాఫ్‌ మెంబర్‌ నిక్‌ షూస్‌ తీసుకుని పరిగెడుతూ అక్కడికి వచ్చింది. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యుద్ధానికి బయల్దేరేముందు కత్తిని మర్చిపోయినట్లు, నిక్‌ ఆటలో తప్పనిసరిగా తొడుక్కోవాల్సిన షూస్‌ను లాకర్‌లో మర్చిపోయాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. 

మరికొందరైతే.. ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ కోసం షూస్ స్పెషల్ డెలివరీ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా నిక్‌ టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో 6-2తో దూసుకొచ్చిన అతను.. ఆతరువాతి రౌండ్‌ను 1-6తో కోల్పోయాడు. ఈ దశలో అతను గాయం బారిన పడటంతో ప్రత్యర్ధికి వాకోవర్ లభించింది. దీంతో అగర్‌ ప్రీక్వార్టర్స్‌కు ప్రవేశించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top