BCCI: బీసీసీఐకి ‘భారీ’ షాక్‌ | Setback for BCCI In HC: Board Asked To Pay Rs 538 Cr To Kochi Tuskers | Sakshi
Sakshi News home page

BCCI: బీసీసీఐకి ‘భారీ’ షాక్‌

Jun 19 2025 10:46 AM | Updated on Jun 19 2025 11:04 AM

Setback for BCCI In HC:  Board Asked To Pay Rs 538 Cr To Kochi Tuskers

PC: BCCI

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి గట్టి షాక్‌ తగిలింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో భాగమైన ఒకప్పటి ఫ్రాంఛైజీ కొచ్చి టస్కర్స్‌ కేరళకు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాగా ఐపీఎల్‌లో ఒక సీజన్‌ తర్వాత తగిన కారణాలు లేకుండా తమ జట్టును రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కొచ్చి టస్కర్స్‌ కేరళ టీమ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో బీసీసీఐదే తప్పని తేల్చింది. అదే విధంగా.. కొచ్చి యాజమాన్యానికి రూ. 538 కోట్లు చెల్లించాలని ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. 

ఎనిమిదో స్థానంలో
కాగా ఐపీఎల్‌- 2011 సీజన్‌లో మాత్రమే ఆడిన టస్కర్స్‌ టీమ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే జట్టు మేనేజ్‌మెంట్‌ నిబంధనలు ఉల్లంఘించిందని, సరైన సమయంలో బ్యాంక్‌ గ్యారంటీ చెల్లించలేదని పేర్కొంటూ కొచ్చి టీమ్‌ను బీసీసీఐ లీగ్‌ నుంచి తప్పించింది.

ఈ విషయంపై... టీమ్‌లో భాగస్వాములైన కొచ్చి క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేసీపీఎల్‌), రెండేవూ స్పోర్ట్స్‌ వరల్డ్‌ (ఆర్‌ఎస్‌డబ్ల్యూ) కోర్టుకెక్కాయి. చివరకు 2015లో కోర్టు ఆర్బిట్రేటర్‌ కొచ్చికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ. 538 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 

అయితే, ఆర్బిట్రేటర్‌ నిర్ణయాన్ని బోర్డు హైకోర్టులో సవాల్‌ చేయగా...ఇప్పుడు అదే తీర్పునకు హైకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం కేసీపీఎల్‌కు రూ.385.50 కోట్లు, ఆర్‌ఎస్‌డబ్ల్యూకు రూ.153.34 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. దీనిపై మళ్లీ అప్పీల్‌ చేసేందుకు బీసీసీఐకి ఆరు వారాల గడువు ఉంది.    

ప్రస్తుతం పది
కాగా ఐపీఎల్‌లో ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కొనసాగుతున్నాయి. వీటిలో ముంబై, చెన్నై అత్యధికంగా ఐదేసి సార్లు టైటిల్‌ గెలవగా.. కోల్‌కతా మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. 

ఇక 2008 నాటి తొలి సీజన్‌లో రాజస్తాన్‌ చాంపియన్‌గా నిలవగా.. సన్‌రైజర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఒక్కోసారి టైటిల్‌ అందుకున్నాయి. తాజాగా ఐపీఎల్‌-2025లో విజేతగా నిలిచి బెంగళూరు జట్టు కూడా చాంపియన్ల జాబితాలో చేరింది. ఇక కొచ్చి టస్కర్స్‌తో పాటు దక్కన్‌ చార్జర్స్‌, గుజరాత్‌ లయన్స్‌ కూడా ఇప్పుడు ఉనికిలో లేవు. వీటిలో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ దక్కన్‌ చార్జర్స్‌ కూడా ఓసారి టైటిల్‌ గెలిచింది.

చదవండి: ప్రపంచంలో ధనిక క్రికెట్‌ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement