ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్‌ శర్మ | Rohit Sharma Revealed Why Used His Viral Koi Garden Mein Nahi Ghoomega Remark | Sakshi
Sakshi News home page

ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్‌ శర్మ

Apr 18 2025 3:56 PM | Updated on Apr 18 2025 4:12 PM

Rohit Sharma Revealed Why Used His Viral Koi Garden Mein Nahi Ghoomega Remark

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) మైదానంలో వ్యూహాలతోనే కాకుండా.. తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఒక్కోసారి తన సరదా చేష్టలతో సహచర ఆటగాళ్లను ఆటపట్టించే హిట్‌మ్యాన్‌.. కీలక సమయాల్లో మాత్రం గంభీరంగా మారిపోతాడు. అలా ఇంగ్లండ్‌ (IND vs ENG)తో 2024 నాటి టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అన్న మాటలు స్టంప్‌ మైకులో రికార్డయ్యాయి.

గార్డెన్‌లో తిరిగేందుకు వచ్చారా?
‘‘ఇక్కడ ఎవరూ ఖాళీగా.. పనీపాటా లేకుండా గార్డెన్‌లో తిరిగేందుకు రాలేదు’’ అంటూ సహచర ఆటగాళ్లను ఒకింత తీవ్ర స్వరంతోనే మందలించాడు. అప్పట్లో వైరల్‌ అయిన ఈ వ్యాఖ్యలపై రోహిత్‌ శర్మ తాజాగా స్పందించాడు. 

‘‘ఆరోజు వైజాగ్‌లో మ్యాచ్‌. ఓవర్‌ పూర్తయ్యే సమయంలో మా వాళ్లు ఏదో వాకింగ్‌కు వచ్చినట్లు గార్డెన్‌లో నడిచినట్లుగా అటూ ఇటూ తిరుగుతున్నారు.

ఒక్కరూ పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా లేనేలేరు. మ్యాచ్‌ చేజారిపోతుందేమోననిపించింది. అది మాకు అతి ముఖ్యమైన, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. అందుకే ఈరోజు మనమంతా ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని మా వాళ్లకు ఆరోజు పొద్దునే గట్టిగా చెప్పాను.

అందుకే నాకు కోపం వచ్చింది
కానీ వాళ్లేమో గ్రౌండ్‌లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. అప్పుడు మేము ఒక్క వికెట్‌ అయినా తీయాలని పరితపించిపోతున్నాం. కానీ ఎవరూ అందుకు తగ్గ ప్రయత్నం చేసినట్లు అనిపించలేదు.

అందుకే నాకు కోపం వచ్చింది. మా వాళ్లకు గట్టిగానే క్లాస్‌ తీసుకున్నా. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను కూల్చాలని చెప్పా. అలాంటి సమయంలో సమిష్టిగా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. 

అయితే, మా వాళ్లు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు కనిపించింది. అందుకే అలా అన్నాను’’ అని రోహిత్‌ శర్మ జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

106 పరుగుల తేడాతో గెలుపు
కాగా గతేడాది ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టులో ఓడిన రోహిత్‌ సేన.. ఆ తర్వాత మిగతా నాలుగు గెలిచి.. 4-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌-2025తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇంత వరకు తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025) ఆరంభానికి ముందు చాంపియన్స్‌ ట్రోఫీ-2025 రూపంలో రోహిత్‌ టీమిండియాకు ఐసీసీ టైటిల్‌ అందించాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్‌-2024లోనూ టీమిండియాను చాంపియన్‌గా నిలిపి దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.

ఇ‍క భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ అందించిన తర్వాత దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో కలిసి రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం లీగ్‌ క్రికెట్‌లో మాత్రమే అతడు పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. కాగా ముంబై ఇండియన్స్‌కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా ఘనత సాధించిన రోహిత్‌ శర్మ.. గతేడాది నుంచి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్‌.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement