భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్ అనిపించుకున్నాడు.
ప్రశంసల వర్షం
గువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా రాజస్తాన్ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ..
నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే
‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్ తాజా ఎడిషన్లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.
ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే వైభవ్ను ఈ టూర్కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.
కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.


