Ranji Trophy: Taruwar Kohli hits Double Hundred vs Arunachal Pradesh - Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీతో విరుచుకుపడిన కోహ్లి

Dec 21 2022 3:42 PM | Updated on Dec 21 2022 3:59 PM

Ranji Trophy 2022 23: Taruwar Kohli Slams Double Hundred Vs Arunachal Pradesh - Sakshi

Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరం కెప్టెన్‌ తరువార్‌ కోహ్లి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బంతితో (4/2) మాయ చేసిన కోహ్లి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో (297 బంతుల్లో 203; 30 ఫోర్లు, సిక్స్‌) విరుచుకుపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌.. కోహ్లి, రాల్టే (4/21), నవీన్‌ (1/22), అవినాశ్‌ యాదవ్‌ (1/17) ధాటికి 304 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్‌ కాగా.. కుమార్‌ న్యోంపు (24), కమ్షా (17), నబమ్‌ అబొ (10) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిజోరం.. తరువార్‌ కోహ్లి, గోస్వామి (50) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. మిజోరం ఇన్నింగ్స్‌లో కోహ్లి, గోస్వామి, ఆండర్సన్‌ (28) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. అరుణాచల్‌ బౌలర్లలో నబమ్‌ అబొ 4, యబ్‌ నియా 3, అఖిలేశ్‌ సహాని 2, చేతన్‌ ఆనంద్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

మిజోరం తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 275 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అరుణాచల్‌ ప్రదేశ్‌.. రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి వికెట్‌ నష్టానికి 77 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. టెకీ నెరీ (27) ఔట్‌ కాగా.. కుమార్‌ న్యోంపు (31), కెప్టెన్‌ సూరజ్‌ తయమ్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. టెకీ నెరీ వికెట్‌ అవినాశ్‌ యాదవ్‌కు దక్కింది. ప్రస్తుతానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇ‍ంకా 198 పరుగుల వెనకంజలో ఉంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన మిజోరం కెప్టెన్‌ తరువార్‌ కోహ్లి.. టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఇద్దరూ మంచి మిత్రులు, 2008లో భారత్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యులు అన్న విషయం చాలామందికి తెలీదు. నాటి ప్రపంచకప్‌లో విరాట్‌తో (235) సమానంగా పరుగులు చేసిన తరువార్‌ (218, 3 వరుస హాఫ్‌ సెంచరీలు).. ఆతర్వాత నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.

మరోవైపు విరాట్‌ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ క్రికెట్‌ చరిత్రలోనే మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోగా.. మీడియం ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన తరువార్‌.. సొంత రాష్ట్రమైన పంజాబ్‌ తరఫున సరైన అవకాశాలు రాక మిజోరంకు వలస వెళ్లి కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. కాగా, టాలెంట్‌ పరంగా చూస్తే విరాట్‌కు తరువార్‌ ఏమాత్రం తీసిపోడని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement