
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇదివరకే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఫైనల్స్కు చేరిన ఆ జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. పసికూన, ఆతిథ్య జింబాబ్వేతో ఇవాళ (జులై 24) జరిగిన నామామాత్రపు మ్యాచ్లో కివీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో టిమ్ రాబిన్సన్ 10, మార్క్ చాప్మన్ 0, బెవాన్ జాకబ్స్ 0, మిచెల్ సాంట్నర్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో మైఖేల్ బ్రేస్వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.
జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.