
జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (జూన్ 26) ప్రకటించారు. ఈ జట్టులో ప్రమాదకర ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చోటు దక్కించుకున్నాడు. 30 ఏళ్ల ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
Jofra Archer is back in Test cricket.#ENGvINDpic.twitter.com/vd4VVRQmM8
— CricTracker (@Cricketracker) June 26, 2025
ఆర్చర్ 2021 ఫిబ్రవరిలో చివరిసారి టెస్ట్ల్లో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను టీమిండియాతోనే ఆడాడు. ఆతర్వాత అతను వరుస గాయాల కారణంగా క్రికెట్కు దూరమయ్యాడు. ఆర్చర్ గతేడాది మేలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి తిరిగి వచ్చాడు.
తాజాగా అతను టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఇటీవల కౌంటీ ఛాంపియన్షిప్ చివరి రౌండ్ మ్యాచ్లో ససెక్స్కు ఆడుతూ డర్హమ్ను ఎదుర్కొన్నాడు. తాజాగా ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో ఆర్చర్ అదనంగా జోడించబడ్డాడు. తొలి టెస్ట్ కోసం ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగింది.
ఆర్చర్ తాజాగా ఆడిన కౌంటీ మ్యాచ్లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్లో 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ఆర్చర్కు బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం దక్కలేదు. రెండో టెస్ట్లో ఆర్చర్కు తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశం ఉంది.
ఆర్చర్ చేరిక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుస్తుంది. ఇప్పటికే ఇంగ్లండ్ తొలి టెస్ట్లో గెలిచి భారత్పై ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో టెస్ట్లో ఆర్చర్ తుది జట్టులో చేరితే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఆర్చర్ తుది జట్టులో చేరితే ఏ పేసర్పై వేటు వేస్తారో చూడాలి.
తొలి టెస్ట్లో పేసర్లు బ్రైడన్ కార్స్ (4 వికెట్లు), జోష్ టంగ్ (7), స్టోక్స్ (5)అద్బుతంగా రాణించారు. వీరు ముగ్గురే 16 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ నిరాశపరిచాడు. అతను రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో రెండో టెస్ట్లో వోక్స్ను పక్కన పెట్టి ఆర్చర్కు అవకాశం ఇవ్వొచ్చు.
ఆర్చర్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. ఈ అర్హతలతో అతను రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్ట్ల్లో 3 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 42 వికెట్లు తీశాడు.
కాగా, టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు సెంచరీలు నమోదైన ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా.. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు.
ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు.
రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్