భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సంచలన వ్యాఖ్యలు | IPL 2025: Moeen Ali Takes Indirect Jibe At Rohit Sharma, MS Dhoni | Sakshi
Sakshi News home page

భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సంచలన వ్యాఖ్యలు

Apr 9 2025 5:26 PM | Updated on Apr 9 2025 6:13 PM

IPL 2025: Moeen Ali Takes Indirect Jibe At Rohit Sharma, MS Dhoni

Photo Courtesy: BCCI

భారత స్టార్‌ క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మకు చురక తగిలేలా కేకేఆర్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెటరన్‌ ఆటగాళ్లు వ్యక్తిగత లక్ష్యాల కోసం కెరీర్‌లను పొడిగించుకోకూడదని అలీ అన్నాడు. వయసు పైబడినా, జట్టు ప్రయోజనాలకు ఉపయోగపడకపోయినా స్వార్థపూరితంగా జట్టులో కొనసాగడం కరెక్ట్‌ కాదని అభిప్రాయపడ్డాడు.

సీనియారిటీ, పదవీ విరమణపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. వ్యక్తిగత లక్ష్యాల కోసం ఏ ఆటగాడూ కెరీర్‌ను పొడిగించుకోకూడదు. ఆటగాళ్లు సీనియారిటీ లేదా స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అనుకోవాలి. వెటరన్లు సరిగ్గా పెర్ఫార్మ్‌ చేయనప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువకులు, ప్రతిభావంతులకు మార్గం చూపాలి. 

పేరున్న ఆటగాడనో లేక భారీ సంఖ్యలో అభిమానులున్నారనో జట్టును పట్టుకుని వేలాడకూడదు. వాస్తవికంగా ఆలోచించాలి. జట్టుకు ఏమైనా ఉపయోగపడుతున్నామా లేదా అన్నది​ పరీక్షించుకోవాలి. జట్టుకు భారమైనప్పుడు హుందాగా తప్పుకోవాలని అన్నాడు. 

మొయిన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు భారత స్టార్‌ క్రికెటర్లు, ప్రస్తుతం ఫామ్‌ లేమితో సతమతమవుతున్న ధోని, రోహిత్‌లకు చురక తగిలేలా ఉన్నాయి. ఈ ఇద్దరు వెటరన్‌ క్రికెటర్లు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2025లో పేలవంగా ఆడుతూ జట్టుకు భారమైపోయారు. చాలామంది వీరు తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నప్పటికీ వారిలో ఏ మాత్రం చలనం లేదు. 

మాలో ఇంకా ఆడే సత్తా ఉందన్నట్లు ఊదరగొడుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ధోని అయినా కాస్త పర్వాలేదనిపించాడు కానీ రోహిత్‌ అయితే దారుణంగా విఫలమవుతున్నాడు. ధోని రోహిత్‌ కంటే దాదాపు ఐదేళ్లు పెద్ద వాడైనప్పటికీ తనకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాడు. 

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ధోని, రోహిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎస్‌కే, ముంబై జట్లు కూడా పేలవంగా ఆడతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తలో నాలుగింట ఓడి చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సీఎస్‌కే, ముంబై ఐపీఎల్‌లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో తలో ఐదు టైటిళ్లు నెగ్గాయి.

మొయిన్‌ విషయానికొస్తే..  ఈ ఇంగ్లిష్‌ క్రికెటర్‌ కూడా వెటరన్‌ ఆటగాడే. ఇతని వయసు 37 ఏళ్లు. అయితే మొయిన్‌ సరిగ్గా పెర్ఫార్మ్‌ చేయనప్పుడు జాతీయ జట్టు నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌లో కేకేఆర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో మొయిన్‌ తనకు అవకాశం వచ్చిన రెండు మ్యాచ్‌ల్లో ఐదు పరుగులు చేసి, రెండు వికెట్లు తీశాడు. మొయిన్‌కు ఇంగ్లండ్‌ తరఫున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అనుభవం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement