
నేడు ఇంగ్లండ్తో భారత మహిళల తొలి టి20
షఫాలీ వర్మపైనే అందరి దృష్టి
రాత్రి గం. 7:00 నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్స్, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం
నాటింగ్హామ్: భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతుండగా... మహిళల క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమవుతోంది. 5 టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుండగా... దానికి ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో లీగ్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా... లోపాలను సవరించుకొని మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ పర్యటన దోహద పడనుంది.
ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమైన యువ ఓపెనర్ షఫాలీ వర్మ జట్టులోకి పునరాగమనం చేయడంతో భారత బలం పెరిగింది. ఈ సిరీస్లో రాణించడం ద్వారా... ఈ ఏడాది భారత్లోనే జరగనున్న వన్డే వరల్డ్కప్లో పాల్గొనే టీమిండియాలోనూ చోటు దక్కించుకోవాలని షఫాలీ భావిస్తోంది. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ బౌలర్ శ్రీచరణి, క్రాంతి గౌడ్, సయాలీ వంటి పలువురు యువ ప్లేయర్లను పరీక్షించనున్నారు. ఇంగ్లండ్ పిచ్లపై కొత్త ఆటగాళ్లకు అవకాశాలిచ్చి... వారిని వచ్చే ఏడాది మెగా టోర్నీ కోసం సంసిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఈ ఏడాది భారత మహిళల జట్టుకు ఇదే తొలి టి20 సిరీస్ కాగా... హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన సిరీస్లకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జట్టుతో జరిగిన రెండు టూర్ మ్యాచ్ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. వన్డే, టి20 ఫార్మాట్లలో జరిగిన ఈ మ్యాచ్ల్లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేసినా... గెలుపుగీత దాటలేకపోయింది.
సీనియర్లపైనే భారం
సుదీర్ఘ పర్యాటనలో టీమిండియా శుభారంభం చేయాలంటే... సీనియర్ ప్లేయర్లు రాణించాల్సిన అవసరముంది. కెపె్టన్ హర్మన్ప్రీత్కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ సత్తా చాటితేనే టీమిండియా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు రెండోసారి టైటిల్ అందించిన హర్మన్ప్రీత్పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బ్యాటర్గా ఇటు సారథిగా ఆమె వాటిని అందుకుంటుందా చూడాలి.
ఇక ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్, వచ్చే ఏడాది టి20 వరల్డ్కప్ నేపథ్యంలో షఫాలీ వర్మ మునుపటి మెరుపులు మెరిపించాల్సిన అవసరముంది. ఓపెనర్గా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకోలేకపోయిన ఉమా ఛెత్రి స్థానంలో షఫాలీ తుది జట్టులోకి రావడం ఖాయమే. పేస్ ఆల్రౌండర్ అమన్జ్యోత్ కౌర్, స్పిన్ ఆల్రౌండర్ స్నేహ్ రాణా ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.
2023 ఫిబ్రవరి తర్వాత తొలిసారి జాతీయ టి20 జట్టులో చోటు దక్కించుకున్న స్నేహ్ రాణా... ఇటీవల డబ్ల్యూపీఎల్లో మెరుగైన ఆటతీరు కనబర్చింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ స్నేహ్ ఆకట్టుకుంది. సీనియర్ పేస్ బౌలర్లు రేణుక సింగ్, పూజ గాయాల కారణంగా ఈ పర్యటనకు అందుబాటులో లేకుండా పోవడంతో... ఇలాంటి సమయంలో యువ క్రీడాకారిణులు జట్టును గెలిపించాలని టీమ్ ఆశిస్తోంది.
సొంతగడ్డపై బలంగా ఇంగ్లండ్..
మరోవైపు సీవర్ బ్రంట్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై సిరీస్ ఆడనుండటం ఆ జట్టుకు అదనపు ప్రయోజనం. అమీ జోన్స్, టామీ బ్యూమౌంట్, డానీ వ్యాట్, సోఫీ వంటి అనుభవం గల ప్లేయర్లు ఆ జట్టుకు ప్రధాన బలం కానున్నారు. మరోవైపు ఇస్సీ వాంగ్, అలీస్ కాప్సీ, సోఫియా డాంక్లీ వంటి యువ క్రీడాకారిణిలు కూడా తమదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి సుదీర్ఘ పర్యటనలో ఎవరు బోణీ కొడతారో చూడాలి!
200
ఈరోజు ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ అంతర్జాతీయ టి20ల్లో భారత్కు 200వ మ్యాచ్ కానుంది. ఇంగ్లండ్ (215), ఆస్ట్రేలియా (200) జట్ల తర్వాత 200 మ్యాచ్లు పూర్తి చేసుకోనున్న మూడో జట్టుగా భారత్ నిలువనుంది. ఇప్పటి వరకు 199 టి20లు ఆడిన భారత్ 108 మ్యాచ్ల్లో నెగ్గి, 84 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆరు మ్యాచ్లు రద్దు కాగా, ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
30 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్లు. 8 మ్యాచ్ల్లో భారత్, 22 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి.
12 ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్తో భారత్ ఆడిన టి20 మ్యాచ్లు. 4 మ్యాచ్ల్లో భారత్, 8 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి.