వాళ్లంతా డుమ్మా!.. వీళ్లకు సీరియస్‌ వార్నింగ్‌.. సిరాజ్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌! | IND vs ENG 2nd Test: Siraj Practises Batting Stern message from Management | Sakshi
Sakshi News home page

వాళ్లంతా డుమ్మా!.. వీళ్లకు సీరియస్‌ వార్నింగ్‌.. సిరాజ్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌!

Jun 28 2025 6:11 PM | Updated on Jun 28 2025 7:20 PM

IND vs ENG 2nd Test: Siraj Practises Batting Stern message from Management

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు నేపథ్యలో టీమిండియా (Ind vs Eng 2nd Test) ప్రాక్టీస్‌లో తలమునకలైంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా ఉండేందుకు కఠినంగా సాధన చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బ్యాట్‌తో నెట్స్‌లో శ్రమించడం విశేషంగా నిలిచింది.

ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు యువ పేస్‌ బౌలర్‌ ప్రసిద్‌ కృష్ణ ట్రెయినింగ్‌ సెషన్‌కు గైర్హాజరు కాగా.. సిరాజ్‌తో ఇతర టెయిలెండర్లు కూడా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌లో మునిగిపోవడం గమనార్హం. టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.

లోయర్‌ ఆర్డర్‌ కూడా దారుణంగా విఫలం
ఈ క్రమంలో లీడ్స్‌ వేదికగా తొలి టెస్టు జరుగగా.. గిల్‌ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బౌలర్లు, ఫీల్డర్లు తేలిపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, లోయర్‌ ఆర్డర్‌ కూడా దారుణంగా విఫలం కావడం ప్రభావం చూపింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి టెయిలెండర్లంతా కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

అదే సమయంలో ఇంగ్లండ్‌ లోయర్‌ ఆర్డర్‌ ఉత్తమంగా రాణించి జట్టు విజయంలో భాగమైంది. ఈ నేపథ్యంలో భారత టెయిలెండర్లపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సిరాజ్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

సీరియస్‌ వార్నింగ్‌.. సిరాజ్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌!
బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ నిర్దేశకత్వంలో సిరాజ్‌ డిఫెన్సివ్‌ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశాడు. షార్ట్‌ బంతులు ఎదుర్కొన్న అతడు.. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా వెళ్తున్న బంతుల్ని వదిలేశాడు. ఫార్వర్డ్‌ డిఫెన్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేశాడు.

సాధారణంగా బౌలర్లు.. ఇంతగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టరు. అయితే, మేనేజ్‌మెంట్‌ ఆదేశాల మేరకు టెయిలెండర్లు బ్యాటింగ్‌పై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌కు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ డుమ్మా కొట్టినట్లు సమాచారం. కాగా గిల్‌ (147)తొలి టెస్టులో శతకం బాదగా.. వైస్‌ కెప్టెన్‌ పంత్‌ ఏకంగా రెండు సెంచరీలు (134, 118) బాదాడు.

ఇక రెండో టెస్టుకు ప్రధాన పేసర్‌ బుమ్రా దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ సూచనల మేరకు నెట్స్‌లో అర్ష్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం ఇందుకు కారణం. కాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టుకు వేదిక. ఇరుజట్ల మధ్య జూలై 2-6 వరకు మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. 

చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement