అన్‌ లక్కీ పంత్‌.. ప్రతిసారి ఇంతే..! | IND VS ENG 1st Test: Rishabh Pant's Five Out Of Six Overseas Test Centuries Came In Losing Cause | Sakshi
Sakshi News home page

అన్‌ లక్కీ పంత్‌.. ప్రతిసారి ఇంతే..!

Jun 25 2025 7:20 PM | Updated on Jun 25 2025 7:42 PM

IND VS ENG 1st Test: Rishabh Pant's Five Out Of Six Overseas Test Centuries Came In Losing Cause

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ క్రికెట్‌ చరిత్రలో మోస్ట్‌ అన్‌ లక్కీ బ్యాటర్‌గా మారిపోతున్నాడు. ఫార్మాట్‌ ఏదైనా ఇతగాడు సెంచరీ చేశాడంటే అతని జట్టు గెలవడం లేదు. తాజాగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో పంత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసినా ఇండియా గెలవలేదు. దీనికి ముందు ఐపీఎల్‌-2025లోనూ ఇలాగే జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ అద్బుత సెంచరీ చేసినా, ఆ మ్యాచ్‌లోనూ అతని జట్టు (లక్నో) గెలవలేదు.

టెస్ట్‌ క్రికెట్‌లో, ప్రత్యేకించి విదేశాల్లో పంత్‌ సెంచరీల బ్యాడ్‌ లక్‌ ఇప్పుడు మొదలైంది కాదు. 2018 నుంచి పంత్‌ విదేశాల్లో 6 టెస్ట్‌ సెంచరీలు చేయగా.. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. 2018లో పంత్‌ తన తొలి విదేశీ టెస్ట్‌ సెంచరీని (114) కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్‌పై చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా దారుణంగా ఓడింది. విదేశాల్లో పంత్‌ రెండో టెస్ట్‌ సెంచరీని (159 నాటౌట్‌) 2019లో సిడ్నీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా అదృష్టవశాత్తు డ్రాతో గట్టెక్కింది.

విదేశాల్లో పంత్‌ మూడో టెస్ట్‌ సెంచరీని (100 నాటౌట్‌) 2022లో న్యూలాండ్స్‌లో సౌతాఫ్రికాపై చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా టీమిండియాకు పరాజయమే ఎదురైంది. విదేశాల్లో పంత్‌ నాలుగో టెస్ట్‌ సెంచరీ (146) అదే ఏడాది ఇంగ్లండ్‌పై (ఎడ్జ్‌బాస్టన్‌) చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ టీమిండియాకు పరాభవం తప్పలేదు. 

తాజాగా హెడింగ్లే టెస్ట్‌లో పంత్‌ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (134 & 118) చేసినా టీమిండియా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఐదు సెంచరీలు (పంత్‌-2, జైస్వాల్‌, గిల్‌, రాహుల్‌) నమోదైనా గెలుపు దక్కకపోవడం శోచనీయం.

ఇదిలా ఉంటే, హెడింగ్లేలో నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత​ బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. 

ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు కూడా టీమిండియా కొంపముంచాయి. భారత జట్టు మ్యాచ్‌ మొత్తంలో ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. ఒక్క జైస్వాల్‌ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్‌ డకెట్‌ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్ట్‌ జులై 2 నుంచి బర్మింగ్హమ్‌ వేదికగా జరుగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement