
ఐపీఎల్ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్ రాయల్స్), 14 ఏళ్ల వయసులోనే క్యాష్ రిచ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. తన విధ్వంసాల పరంపరను కొనసాగిస్తున్నాడు.
ఐపీఎల్ సంచలన ప్రదర్శనల (7 మ్యాచ్ల్లో 206.56 స్ట్రయిక్రేట్తో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 252 పరుగులు) అనంతరం ఎన్సీఏలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో 90 బంతుల్లోనే 190 పరుగులు చేసిన వైభవ్.. ఇవాళ (జూన్ 27) ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో మరోసారి చెలరేగిపోయాడు. భారత్-ఏ తరఫున 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు.
VAIBHAV SURYAVANSHI MADNESS..!! 🥶🔥
- Smashed 48 runs in just 19 balls.
- With 3 fours and 5 sixes. pic.twitter.com/HOKgnYGd4m— Sports Culture (@SportsCulture24) June 27, 2025
ఈ మ్యాచ్లో మరో ఐపీఎల్ చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించిన వైభవ్.. ఇంగ్లండ్ యువ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ ధాటికి భారత్ 7 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వైభవ్ హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.
వైభవ్ క్రీజ్లో ఉన్నంత సేపు నిదానంగా ఆడిన ఆయుశ్ మాత్రే.. వైభవ్ ఔటయ్యాక వరుసగా రెండు బౌండరీలు బాది ఔటయ్యాడు. మాత్రే 30 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా ఇంగ్లండ్ నిర్దేశించిన 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
13 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 104/3గా ఉంది. విహాన్ మల్హోత్రా (4), అభిగ్యాన్ కుందు (4) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో వైభవ్, మాత్రేతో పాటు మౌల్యరాజ్సింగ్ చవ్డా (16) కూడా ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 2, రాల్ఫీ అల్బర్ట్ ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూల్చారు. కనిష్క్ చౌహాన్ (10-1-20-3), మొహమ్మద్ ఎనాన్ (10-1-37-2) తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగా.. పేసర్లు ఆర్ఎస్ అంబరీష్, హెనిన్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రాకీ ఫ్లింటాఫ్ (ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు) అర్ద సెంచరీతో (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. ఇస్సాక్ మొహమ్మద్ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో సత్తా చాటాడు.
మిగతా బ్యాటర్లలో బెన్ డాకిన్స్ (18), బెన్ మేయర్స్ (16), జేమ్స్ మింటో (10) రెండంకెల స్కోర్లు చేయగా.. కెప్టెన్ థామస్ ర్యూ (5), జోసఫ్ మూర్స్ (9), రాల్ఫీ ఆల్బర్ట్ (5), జాక్ హోమ్ (5), తజీమ్ చౌద్రీ అలీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కాగా, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల కోసం భారత అండర్-19 జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది.