
ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్హామ్లో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడో, లేదోనన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులకు జట్టును ప్రకటించిన సమయంలోనే బుమ్రా కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని యాజమాన్యం పేర్కొంది. బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్వయంగా వెల్లడించాడు.
బుమ్రాపైనే భారం
ఇక ఈ టూర్కు పేస్ దళంలో నాయకుడు బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, యువ ఆటగాళ్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్ (Akash Deep) కూడా ఎంపికయ్యారు. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక ప్రసిద్ కృష్ణ వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ 27 ఓవర్ల బౌలింగ్లో 122 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్ల బౌలింగ్లో 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరోవైపు.. ప్రసిద్ కృష్ణ తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్ల బౌలింగ్లో 128 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్ల బౌలింగ్లో 92 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకోగలిగాడు.
షమీ ఉంటే బాగుండేది
అయితే, జట్టు బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో అతడిపైనే భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో మహ్మద్ షమీ ఉండి ఉంటే ఉపయోగకరంగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పేస్ బౌలర్ 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరగా ఆడాడు.
ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు చాలా కాలం దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్లలో కలిపి ఒక ఫైఫర్ సాయంతో తొమ్మిది వికెట్లు కూల్చాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం రాణించలేకపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన షమీ.. తొమ్మిది మ్యాచ్లలో కలిపి కేవలం ఆరు వికెట్లే తీయగలిగాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో పర్యటనకు సెలక్టర్లు షమీ పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఫిట్నెస్ సమస్యలు కూడా ఇందుకు ఓ కారణం అని అగార్కర్ మాటల ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో బుమ్రాకు పనిభారం తగ్గించినట్లుగా.. షమీకి కూడా ఓ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బుమ్రా మూడు ఆడితే.. షమీ కనీసం రెండు ఆడలేడా?
సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం.. ప్రసిద్ అనుభవలేమి బౌలర్ కావడంతో షమీ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. బుమ్రాను మూడు టెస్టులు ఆడిస్తే.. షమీని కనీసం రెండు టెస్టుల్లో ఆడించాల్సిందనే వాదన వినిపిస్తోంది. కాగా 34 ఏళ్ల షమీ ఇప్పటి వరకు తన టెస్టు కెరీర్లో 64 మ్యాచ్లలో కలిపి 229 వికెట్లు కూల్చగా.. ఇందులో ఇంగ్లండ్ గడ్డ మీద 14 మ్యాచ్లు ఆడి 42 వికెట్లు తీశాడు.
మరోవైపు సిరాజ్.. ఇప్పటికి ఆడిన 37 టెస్టుల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఏదేమైనా ఇంగ్లండ్ టూర్లో అనుభవజ్ఞుడైన షమీ ఉంటే పేస్ బౌలింగ్ విభాగం మరింత బలపడేదని విశ్లేషకులు అంటున్నారు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడనుంది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా రెండో టెస్టుకు జూలై 2-6 వరకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్