
లాహోర్: మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు విజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫర్జానా (57; 6 ఫోర్లు), షర్మిన్ అక్తర్ (57; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్యాథరిన్ బ్రైస్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులకు పరిమితమైంది. ప్రియనాజ్ (63 బంతుల్లో 61; 7 ఫోర్లు), రాచెల్ (73 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా 4, జన్నతుల్ 2 వికెట్లు తీశారు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్ 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో ఐర్లాండ్ 46 పరుగుల తేడాతో థాయ్లాండ్ జట్టుపై గెలిచింది.
ఇది కూడా చదవండి:
శ్రేయస్ అయ్యర్కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు
దుబాయ్: భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మార్చి నెలకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దక్కింది. చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చినందుకుగానూ అయ్యర్ను ఈ పురస్కారం వరించింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వివరాలు వెల్లడించింది. చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో అయ్యర్ అత్యధిక పరుగులు (243) చేసిన ప్లేయర్గా నిలిచాడు.
న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ కూడా ఈ పురస్కారం కోసం పోటీపడగా... ఆ ఇద్దరినీ వెనక్కి నెడుతూ అయ్యర్ విజేతగా నిలిచాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీ హస్తగతం చేసుకోవడంతో పాటు అవార్డు గెలుచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని అయ్యర్ అన్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారాన్ని భారత ఆటగాడు శుబ్మన్ గిల్ దక్కించుకున్నాడు.