
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఓషివరాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. స్క్వేర్యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర రూ. 27.50 కోట్లని తెలుస్తుంది. ఈ రెండు అపార్ట్మెంట్లు DLH ఎన్క్లేవ్ అనే నివాస ప్రాజెక్ట్లోని 17 మరియు 18వ అంతస్తులలో ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 9,603 చదరపు అడుగులు (నివాస ప్రాంతం 4,200, బాల్కనీ 3,800 చదరపు అడుగులు).
అపార్ట్మెంట్లతో పాటు మూడు పార్కింగ్ స్థలాలను దూబే దేవ్ ల్యాండ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీ జూన్ 20, 2025న నమోదు చేయబడింది. దీనికి మొత్తం రూ. 1.65 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించబడ్డాయి. DLH ఎన్క్లేవ్లో ఇదివరకే పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. బాలీవుడ్ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయకుడు మికా సింగ్, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం ఇక్కడే నివాసముంటుంది.
31 ఏళ్ల శివం దూబే (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్) భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. దేశీయ క్రికెట్లో అతను ముంబైకి ఆడతాడు.
2019 నవంబర్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దూబే ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 వన్డేలు, 35 టీ20లు ఆడి 574 పరుగులు చేశాడు. అలాగే 14 వికెట్లు పడగొట్టాడు. దూబే ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 10 హాఫ్ సెంచరీల సాయంతో 1859 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు.