బెంగళూరు తొక్కిసలాట.. విరాట్‌ కోహ్లిని అరెస్ట్‌ చేయండి..! | Bengaluru Stampede Takes An Ugly Turn, #ArrestKohli Trends On Twitter | Sakshi
Sakshi News home page

బెంగళూరు తొక్కిసలాట.. విరాట్‌ కోహ్లిని అరెస్ట్‌ చేయండి..!

Jun 6 2025 4:29 PM | Updated on Jun 6 2025 5:03 PM

Bengaluru Stampede Takes An Ugly Turn, #ArrestKohli Trends On Twitter

ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన బెంగళూరు తొక్కిసలాట దారుణమైన మలుపు తీసుకుంది. సోషల్‌మీడియాలో కొందరు ఈ విషాద ఘటనకు విరాట్‌ కోహ్లిని బాధ్యున్ని చేస్తూ, అరెస్ట్‌కు డిమాండ్‌ చేస్తున్నారు. '#ArrestKohli' హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. బెంగళూరులో జరిగిన ప్రాణనష్టానికి విరాట్ కోహ్లీనే కారణమని ఓ వర్గం ఆరోపిస్తుంది. 

కోహ్లికి వ్యతిరేకంగా ట్విటర్‌లో 36 వేలకు పైగా ట్వీట్లు ఉన్నాయి. తమను చూడటానికి వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోయారని తెలిసి కూడా కోహ్లి పట్టీపట్టనట్లు ఉన్నాడని చాలా మంది ఆరోపిస్తున్నారు. దుర్ఘటన విషయం తెలియగానే కోహ్లి బెంగళూరు వదిలి పారిపోయాడని అంటున్నారు. ఆర్సీబీ యాజమాన్యం చుట్టూ ఉచ్చుబిగుసుకున్న తరుణంలో కోహ్లి లండన్‌కు పారిపోవాలని చూస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కోహ్లి దేశం విడిచి పారిపోయేలోపు అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ (పుష్ప-2 తొక్కిసలాట) అరెస్ట్‌ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కోహ్లికి మానవత్వమే లేదని అంటున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. కోట్లకు కోట్లు సంపాదిస్తూ, బాధిత ‍కుటుంబాలకు కనీస ఆర్దిక సాయం ప్రకటించలేదని దుయ్యబడుతున్నారు.

మరోపక్క కోహ్లికి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు. ఎవరూ కోరుకోని, ఊహించని ఘటనకు కోహ్లిని ఎలా బాధ్యున్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోహ్లి అరెస్ట్‌ను డిమాండ్‌ చేయడం మూర్ఖత్వమని అంటున్నారు. కోహ్లి దేశం విడిచి పారిపోతున్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీస్తున్నారు. కోహ్లి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తాడని భరోసా ఇస్తున్నారు. 

అర్దిక సాయం ప్రకటించి చేతులు దులుపుకోవడం ఇష్టం లేకే, కోహ్లి ఎలాంటి ఆర్దిక సాయం ప్రకటించలేదని అంటున్నారు. కోహ్లి అంటే గిట్టని వారే ఈ రకమైన ప్రచారానికి పూనుకున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయంలో కోహ్లికి మద్దతుగా నిలిచే వారంతా ముందుక రావాలని పిలుపునిస్తున్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమరని అంటూనే, ప్రాణ నష్టాన్ని కోహ్లికి ఆపాదించడం కరెక్ట్‌ కాదని అంటున్నారు.  

కాగా, బెంగళూరు దుర్ఘటనకు సంబంధించి ఇవాళ (జూన్‌ 6) ఉదయం ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. ముంబైకి వెళ్తుండ‌గా బెంగళూరు ఎయిర్‌పోర్టులో అత‌డిని అదుపులోకి తీసుకున్న‌ట్లు సమాచారం. అదే విధంగా ఈ ఈవెంట్‌ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్‌ జర్నీలో తొలిసారి టైటిల్‌ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని భావించింది. ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్‌ టాప్‌ బస్‌లో పరేడ్‌ నిర్వహించాలని ప్లాన్‌ చేసింది. 

అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. 

స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్‌లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement