
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.
ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.
బీసీసీఐ ప్రతిపాదించిన గైడ్లైన్స్ ఇవే..
👉కూలింగ్-ఆఫ్ పీరియడ్: ఏ జట్టు అయినా టైటిల్ గెలిచిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి నిరాకరణ.
👉బీసీసీఐ క్లియరెన్స్ తప్పని సరి: జట్లు ఏదైనా వేడుకను నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.
👉బోర్డు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.
👉భద్రతా బ్లూప్రింట్ను ముందే సమర్పించాలి. ఫైవ్ టైర్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.
👉విమానాశ్రయం నుండి కార్యక్రం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి.
👉ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించడం.
👉జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి.