Asia Championships: క్వార్టర్‌ ఫైనల్లో సింధు

Asia Championships: PV Sindhu, HS Prannoy advance to quarterfinals  - Sakshi

దుబాయ్‌: ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో మూడో పతకానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–12, 21–15తో తొమ్మిదో ర్యాంకర్‌ హాన్‌ యువె (చైనా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి చేరింది. హాన్‌ యువెపై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. 2014, 2022లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు నెగ్గిన సింధు నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)తో ఆడుతుంది.

గతంలో ఆన్‌ సె యంగ్‌తో ఆడిన ఐదుసార్లూ సింధు ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21–16, 5–21, 21–18తో చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)పై నెగ్గగా... కిడాంబి శ్రీకాంత్‌ 14–21, 22–20, 9–21తో కొడాయ్‌ నరోకా (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సియో సెయుంగ్‌ జే–చె యు జంగ్‌ (దక్షిణ కొరియా) జోడీ నుంచి సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జంటకు వాకోవర్‌ లభించడంతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–13, 21–11తో జిన్‌ యోంగ్‌–నా సంగ్‌ సెంగ్‌ (కొరియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట గాయం కారణంగా బరిలోకి దిగకుండా ప్రత్యర్థి జోడీకి వాకోవర్‌ ఇచ్చింది.
చదవండి: IPL 2023: అందుకే ఆ పని పనిచేశా.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి: శాంసన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top