Ashes 2nd Test: రిచర్డ్సన్ పాంచ్ పటాకా.. ఇంగ్లండ్ ఘోర పరాజయం
Jhye Richardson Maiden Five Wicket Haul: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్(5/42) కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన రిచర్డ్సన్ రెండో ఇన్నింగ్స్లో చెలరేగిపోయి బర్న్స్(34), హమీద్(0), బట్లర్(26), క్రిస్ వోక్స్(44), ఆండర్సన్(2) వికెట్లు సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకే కుప్పకూలింది.
82/4 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రిచర్డ్సన్, మిచెల్ స్కార్క్(2/43), నాథన్ లయన్(2/55), మైఖేల్ నెసర్(1/28) ధాటికి 192 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(103), రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ(51) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ను 473/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను 230/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 468 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఛేదనలో ఇంగ్లండ్192 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది.
చదవండి: పిచ్ను చూసి షాక్కు గురైన శ్రేయాస్.. ప్రాక్టీస్లో నిమగ్నం కావాలన్న ద్రవిడ్
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు