
మధ్యప్రదేశ్ లీగ్ (MPL) 2025లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరాభిమాని అభిషేక్ పాఠక్ విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా జబల్పూర్ రాయల్ లయన్స్, బుందేల్ఖండ్ బుల్స్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్లో బుందేల్ఖండ్ బుల్స్కు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ పాఠక్.. కేవలం 33 బంతుల్లో సెంచరీ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు.
అతడిని ఆపడం ఎవరిని తరం కాలేదు. అభిషేక్ ఓవరాల్గా 48 బంతుల్లో15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కరణ్ తహిలియానితో కలిసి మొదటి వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బుందేల్ఖండ్ బుల్స్ 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో జబల్పూర్ జట్టు 227 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో బుందేల్ఖండ్ విజయం సాధించింది.
"నేను 13 ఏళ్ల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఇప్పటివరకు అండర్-16, అండర్-19, అండర్-23 స్దాయిలో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాను. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాను నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నాను.
నేను ఈ స్దాయికి చేరుకోవడానికి మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు ఎంతో ఇష్టం. సూర్యకుమార్ యాదవ్ లాగా స్థిరత్వం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ దిశగా నేను నిరంతరం కృషి చేస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం అభిషేక్ పాఠక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 229 పరుగులు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్..
ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన అభిషేక్ పాఠక్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఇండియన్ క్రికెటర్గా అభిషేక్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరిట ఉండేది. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్పై సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సూర్యవంశీ రికార్డును పాఠక్ బ్రేక్ చేశాడు.
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్లు వీరే
ఉర్విల్ పటేల్- 28 బంతులు
అభిషేక్ శర్మ- 28 బంతులు
రిషబ్ పంత్- 32 బంతులు
అభిషేక్ పాఠక్-33 బంతులు
వైభవ్ సూర్యవంశీ- 35 బంతులు