న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026
మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడున్నరేళ్లయినా పనులు పూర్తికావడంలేదు. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు. ఈ మార్గంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి. త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి, సిద్దిపేట
నత్తనడకన నేషనల్ హైవే నిర్మాణం
ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం
మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి(765డీజీ) రహదారి 133.61 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.1,461కోట్లను కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.11 నవంబర్ 2022న ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఈ రహదారిని రెండు ప్యాకేజీలుగా జాతీయ రహదారుల శాఖ విభజించింది. అందులో మొదటి ప్యాకేజీ మెదక్ నుంచి సిద్దిపేట 69.97కిలో మీటర్లు విభజించి రూ.882 కోట్లు, రెండో ప్యాకేజీ సిద్దిపేట నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు 63.64 కిలోమీటర్లకు రూ. 579కోట్లను కేటాయించారు. ఈ రోడ్డును ఫోర్లేన్ రోడ్డు 15మీటర్ల వెడల్పుతో, సాధారణ దగ్గర డబుల్ రోడ్తో 10మీటర్లు విస్తరించారు.
అటవీ శాఖ అనుమతి పెండింగ్
కోహెడ మండలం నాగసముద్రాల నుంచి గండీమైసమ్మ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జరగడం లేదు. దాదాపు 1.5కిలో మీటర్లు అటవీ శాఖ పరిధిలో ఉంది.. దీంతో అటవీ శాఖ అనుమతులు ఇంకా పెండింగ్లో ఉంది. జాతీయ రహదారులు, అటవీ శాఖ సమన్వయ లోపంతోనే పనులు జరగడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు గుంతల మయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ముందుకు సాగని ఫ్లైఓవర్..
సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లే మార్గంలో మిట్టపల్లి వద్ద రైల్వే ట్రాక్ ఉంది. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. రెండున్నరేళ్లుగా బ్రిడ్జి నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో రైలు రాకపోకలు సాగిస్తోంది. రైల్వే గేట్ వేస్తుండటంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మూడున్నరేళ్లుగా సాగుతున్న
విస్తరణ పనులు
ఇంకాపూర్తికాని ఫ్లైఓవర్లు..
అనుమతులు రాక పలుచోట్ల పనులకు బ్రేక్
ఇబ్బంది పడుతున్నాం
నాగసముద్రాల వద్ద రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. అంతటా రోడ్డు నిర్మాణం జరిగింది. ఒక్క మాదగ్గరే నిలిచిపోయింది. భారీ వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తే దుమ్ము లేస్తోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.
– చిరంజీవి,
వాహనదారుడు, నాగసముద్రాల
అనుమతులు రాకపోవడంవల్లే..
అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. ఇచ్చిన సమయం దాటిపోవడంతో సదరు కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. గత సంవత్సరం నుంచి పనులు కావడం లేదు. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలిపాం. త్వరలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తాం.
– అన్నయ్య, డీఈ, జాతీయ రహదారులు
బైపాస్లో నిలిచిన పనులు
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు దాదాపు మూడు కిలో మీటర్లు రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణం పనులు మధ్యలో నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎన్సాన్పల్లికి వెళ్లే దారిలో ఫ్లైఓవర్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి ఒక్కో దగ్గర ఎత్తు.. మరొక దగ్గర వంపుగా ఉండటంతో వాహనాలు అదపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.


