సిద్దిపేటఎడ్యుకేషన్: డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుదామని జిల్లా కలెక్టర్ హైమవతి యువతకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్లో గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని పోలీస్ కమిషనర్(సీపీ) రష్మీపెరుమాళ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా డ్రగ్స్ దిర్వినియోగం, అక్రమ రవాణపై ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు, ర్యాలీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాల దుర్వినియోగం, వాటి రవాణాపై అవగాహన పెంపొందింంచుకుని వాటికి వ్యతిరేకంగా పోరాడాలని పిలపునిచ్చారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వారి జీవితాలను కాపాడుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవర్చుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. తల్లిదండ్రలు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, ఒక వేళ వారి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వచ్చినా, నూతన వ్యక్తులతో కలిసినా మరింత జాగ్రత్త వహించాలని చెప్పారు. సీపీ రష్మీపెరుమాళ్ మాట్లాడుతూ డ్రగ్స్తో యువత జీవితాలను నాశనం చేసుకుని కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే నేరమని, వారి సమాచారాన్ని పోలీసులకు తెలపాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అనంతరం డ్రగ్స్కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటు పడుతామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల జిల్లా అధికారులు శారధ, విజిత, రాము, గణేశ్, ప్రిన్సిపల్ దేవయ, అధ్యాపకులు సుధాకర్రెడ్డి, కనకచంద్రం, అశోక్, ధరిపల్లినగేశ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
యువతకు కలెక్టర్ హైమావతి పిలుపు
ప్రభుత్వ జూనియర్ కళాశాలవిద్యార్థుల ర్యాలీ
హాజరైన సీపీ రష్మీపెరుమాళ్


