మిరుదొడ్డి(దుబ్బాక): పల్లెల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు, అందెలో ఎంపీ, ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ.66 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. కాగా మిరుదొడ్డిలోని అరుంధతి కల్యాణ మండపంలో తాగునీటి బోరు బావి తవ్వకంతో పాటు, కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎంపీకి అంబేడ్కర్ చైతన్య సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, జిల్లా నాయకులు ఎల్ముల దేవరాజు, భిక్షపతి, జిల్లా టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ల మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి
ఎంపీ రఘునందన్ రావు


