బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): గోమాతకు ప్రదక్షిణ చేస్తే సర్వదేవత ప్రదక్షిణ చేసినట్టేనని, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం ధర్మవర్ధిని ట్రస్ట్, సిద్దిపేట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోమాత వైభవం–గో సంరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోవు పేడ ఇంటి ముందు చల్లితే శుభానికి సంకేతం అన్నారు. గోవుని సంరక్షిస్తే వేంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుందని తెలిపారు. గోవు అందరికి లోకమాత అన్నారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, కలెక్టర్ హైమావతి, తదితరులు పాల్గొన్నారు.
చిన్నకోడూర్(సిద్దిపేట): మండల పరిధిలోని ఎల్లాయపల్లి మధిర కొత్తపల్లిలో జరుగుతున్న పోచమ్మ దేవాలయ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్విహించారు. అమ్మవారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, శ్రీనివాస్, పాపయ్య, సర్పంచ్ రాజు, త దితరులు పాల్గొన్నారు.
ములుగు ఏడీఏ అనిల్కుమార్
వర్గల్(గజ్వేల్): ఎరువుల విక్రయాలలో డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, రైతులకు నాణ్యమైన సేవలందించాలని ములుగు డివిజన్ ఏడీఏ అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం గౌరారం రైతువేదికలో మర్కూక్, వర్గల్ మండలాల డీలర్లకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు సకాలంలో అందజేసేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ ‘యాప్’ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైతులకు యాప్ ద్వారా యూరియా అమ్మకాలు సాఫీగా నిర్వహించాలని కోరారు. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇబ్బందిపడకుండా వారి తరఫున బుకింగ్ ప్రక్రియ సులభతరం చేయాలన్నారు. నానోయూరియా ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వర్గల్, జగదేవపూర్, మర్కూక్ ఏఓలు శేషశయన, వసంతరావు, రాము పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ
గజ్వేల్: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వానికి ఉద్యమాలతో గుణపాఠం చెబుతామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ.. ప్రధాని నిత్యావసరాల ధరలను పెంచుతూ పేదల జీవితాలను భారంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సీపీఐ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ కార్యదర్శి దయానందరెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి పవన్, మెదక్ జిల్లా కార్యదర్శి కాళిక్, సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్, నాయకులు వీర్ల ప్రకాశ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.


