చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్)/ శివ్వంపేట(నర్సాపూర్): అకాల వర్షం జిల్లాను వణికించింది. ఆదివారం ఉదయం ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం శ్రమించి పడించిన పంట వర్షార్పణం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడగా, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.


