ములుగు(గజ్వేల్): ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థి బోచు జీవన్ అటవీ శాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఫైటోసోసియాలజీ, కార్బన్ నిల్వలు మరియు ప్రధాన మట్టి పోషకాలపై అధ్యయనం పూర్తి చేశారు. జీవన్ పీహెచ్డీ సాధించడంపై కళాశాల డీన్ ప్రవీణ, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్రావు, డిప్యూటీ డైరెక్టర్ కవిత, అధ్యాపకులు అభినందించారు.
పరీక్షా కేంద్రాల వద్ద
పటిష్ట బందోబస్తు
పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: జిల్లాలో జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ (తె లంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 20నుంచి 27వరకు పరీక్షలు జరగనున్నందున ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షలకు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
సర్కారు బడిలో
సకల వసతులు
హవేళిఘణాపూర్(మెదక్): బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చూడాలని డీఈఓ విజయ అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచన్పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శివరాజ్, శశికుమార్, కృష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన
వైద్య సేవలు
చిన్నశంకరంపేట(మెదక్): వైద్యారోగ్యంపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. శనివారం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్టులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ యాదగిరిరావు, ఎంఎల్హెచ్పీ కుమారి, సూపర్వైజర్ బుజ్జి, అనిత, నర్సింహులు పాల్గొన్నారు.
పకడ్బందీగా జనగణన
కౌడిపల్లి(నర్సాపూర్): జనగణన పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జనగణనపై ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనాతో 2021లో జనగణన జరగలేదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని లెక్కించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు ఉండి, తక్కువ జనాభా ఉంటారని, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఇళ్లు ఉంటాయని తెలిపారు. దీంతో జాగ్రత్తగా గణన చేయాలన్నారు.


