హుస్నాబాద్: గతంలో పనికి రాదని కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి, ఇప్పుడు మరమ్మతులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ద్వారా కాంగ్రెస్ నాయకుల మాటలన్నీ అబద్ధాలని తెలిపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ శివారులోని పోతారం(ఎస్) శుభం గార్డెన్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ గెలిచిందని మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్


