దుబ్బాకటౌన్: ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను కనీసం 100 మందికి పెంచే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య అధికారులను ఆదేశించారు. శనివారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, మురుగు కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, రహదారి పక్కన మట్టి పనులు చేపట్టడం ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, సమయానికి వేతనాలు చెల్లించేలా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని హెచ్చరించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను క్రమం తప్పకుండా సేకరించి, డంపింగ్ షెడ్డులకు తరలించాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బోర్లు, ట్యాంకులు, పైపులైన్లకు సకాలంలో మరమ్మతులు చేయించాలని సూచించారు.
డీఆర్డీఓ జయదేవ్ ఆర్య


