● కలెక్టర్ హైమావతి
● అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటరూరల్: రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు నిర్వహణలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. గత యాసంగి సీజన్లో 93,142 మంది రైతుల నుంచి 3,84,147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.884.56 కోట్లు మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో 5,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 421 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు.
మండల సభలను సమర్థంగా నిర్వహించాలి
ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 16న జరిగే మండల సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, రుణమాఫీ సంబంధిత పూర్తి సమాచారాన్ని , ప్రభుత్వం అందజేసిన నిధులను వివరించాలన్నారు. సాధారణ సేంద్రీయ వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, లక్ష్మీకిరణ్, జెడ్పీ సీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీపీఓ రవీందర్, డీడబ్ల్యూఓ శారధ, ఇరిగేషన్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.


