నోటిఫికేషన్ జారీ చేసిన మున్సిపల్ కమిషనర్
హుస్నాబాద్: ఎన్నో రోజులుగా ఆశావహులు ఎదురు చూస్తున్న మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక సందడి మొదలైంది. బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి సారిగా హుస్నాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకున్న విషయం విదితమే. 20 వార్డులకు గాను 14 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ గెలుచుకుంది. నలుగురు కో ఆప్షన్ సభ్యులను కౌన్సిల్ ఎన్నిక చేయనుంది. ఇందులో మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్ధానాలు (మహిళా, జనరల్)కు కేటాయించారు. మైనార్టీలకు రెండు స్థానాలు (మహిళ, జనరల్) కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టికెట్లు ఆశించి భంగపడిన వారికి, మాజీ కౌన్సిలర్లకు కో ఆప్షన్ పదవులు ఇస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీనే నమ్ముకొని ఉంటున్న కాంగ్రెస్ నాయకులు కో ఆప్షన్ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీ కోటా నుంచి మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్ ముందు వరుసలో ఉన్నారు. అలాగే మాజీ ప్రజా ప్రతినిధుల కోటా నుంచి పున్న లావణ్య, తణుకు ఆంజనేయులు, స్వరూప, వల్లపు రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ఆశీస్సులు ఉన్న వారికి కో ఆప్షప్ పదవులు దక్కనున్నాయి. అర్హులైన వారు ఈనెల 21వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలో ధరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కోరారు.


